Earthquake : మయన్మార్ భూకంప (Myanmar earthquake) మృతుల సంఖ్య అంతకంతకే పెరుగుతోంది. శుక్రవారం భూకంపం సంభవించిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. శిథిలాలను తొలగించినా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 2,719 మంది మృతదేహాలను వెలికితీశారు. స్థానిక మీడియా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారని తెలిపింది. మరో 4,521 మంది గాయపడ్డారని, ఇంకో 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని పేర్కొంది.
ఇప్పటికే సైనిక పాలన, అంతర్యుద్ధాలతో మగ్గిపోతున్న మయన్మార్పై గత శుక్రవానం సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమైంది. కొన్ని ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవడం కూడా కష్టంగా ఉంది. దాంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడం ఆలస్యమవుతోంది. మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెలువడుతోంది. మండుటెండలో ఉత్త చేతులతో, చిన్నచిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు స్థానిక ప్రజలు ప్రయత్నిస్తున్నారు.
మాండలే ప్రాంతంలోనే ఓ ప్రీస్కూల్ కూలిపోవడంతో 50 మంది చిన్నారులు, ఇద్దరు టీచర్లు చనిపోయారని ఐరాస సిబ్బంది వెల్లడించారు. వివిధ దేశాల నుంచి వస్తోన్న సహాయక బృందాలు భూకంప ప్రాంతాలకు వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటు దళాల మధ్య జరుగుతోన్న ఘర్షణలు అవరోధంగా మారాయి. ఈ పరిణామాల మధ్య మృతుల సంఖ్య ఎంతకు చేరుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్ తక్షణమే అందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు పిలుపునిస్తున్నాయి.