అంకారా: తుర్కియే, సిరియాలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. ప్రకృతి ప్రకోపానికి ఇరు దేశాల్లో 28 వేల మందికిపైగా బలయ్యారు. శిథిలాల కింది చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఏడు రోజులుగా సహాయక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయితే వేల సంఖ్యలో బిల్డింగ్లు కూలిపోవడం, గడ్డకట్టే చలి వాతావరణం, ఆహార లేమితో మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించి వారం రోజులు గడుస్తుండటంతో శిథిలా కింద ఇంకా ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సర్వం కోల్పోయి తాత్కాలిక శిభిరాల్లో ఉన్నవారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గుట్టుమిట్టుమంటూ రోజులు గడుపుతున్నారు. చలితీవ్రతకు పిల్లల దుస్తులు, ఇతర సామాగ్రిని కాల్చుతూ ఉపశమనం పొందుతున్నారు.
కాగా, తమ దేశంలో భూకంపం వల్ల 24,617 మంది మరణించారని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించారు. మరో 80,104 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక సిరియాలోని, తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 3,575 మంది మృతిచెందారు.
తుర్కియే, సిరియా దేశాలకు ప్రపంచ దేశాలు తమవంతుగా సాయం అందిస్తున్నాయి. భూకంప బాధితులకు మూడు నెలల అత్యవసర వీసాలను జపాన్ మంజూరుచేసింది. బాధితులు తమ కుటుంబాలతో కలిసి తమ దేశానికి రావచ్చని జర్మనీ ఇంటీరియర్ మినిస్టర్ న్యాన్సీ ఫైజర్ తెలిపారు. ఇక భారత సైన్యానికి చెందిన 99 మంది డాక్టర్లు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. కుప్పకూలిన దవాఖానల సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో బాధితులకు వైద్యసాయం చేస్తున్నారు. ఆపరేషన్ దోస్త్లో భాగంగా ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర సహాయ సామాగ్రితో ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్ నుంచి తుర్కియే, సిరియాకు ఏడో విమానం బయల్దేరింది.
#WATCH | The 7th #OperationDost flight departs from Hindon Airbase in Ghaziabad, for Syria and Türkiye.
The flight is carrying relief material, medical aid, emergency & critical care medicines, medical equipment & consumables. pic.twitter.com/6K2ZLHtoPt
— ANI (@ANI) February 11, 2023