వేదిక అందంగా ముస్తాబైంది. ‘వర్ధిల్లవే భామామణి.. వర్ధిల్లు నీలవేణి’ పద్యం వినిపించింది. వెంటనే పరదా తెరుచుకుంది. ‘ఓ దేవీ’ అనే పిలుపు. ‘ఎవరు సామీ’ అంటూ ప్రశ్న.‘నేనే దేవీ’ అని సమాధానం. ‘నువ్వంటే ఎవరయ్యా?’ మరో ప్రశ్న. ‘మల్లెపూవులా మాలలు తెచ్చితి.. నేనే వొచ్చితి.. నేనే దేవీ’ అంటుండగా వేదిక దద్దరిల్లింది. అదొక యక్షగాన నాటకం.
కళల కాణాచి తెలంగాణ. జానపద కళా వైభవాన్ని ఆధునిక సినిమా దెబ్బతీసింది. దాదాపు కళలన్నీ కనుమరుగయ్యే పరిస్థితి. ఉన్న కొద్దోగొప్పో కళలను ఇప్పుడు డిజిటల్ మీడియా వెంటాడుతున్నది. పరిస్థితి ఇలాగే ఉంటే? మ్యూజియంలో పెట్టుకోవడానికి కూడా ఏమీ ఉండదు. కళలు ఎదుర్కొంటున్న ఈ సంకట పరిస్థితి నుంచి కాపాడే ప్రయత్నమే ‘చెంచు లక్ష్మి’ యక్షగాన నాటకం. రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈమధ్యే ఈ నాటకం ప్రదర్శితమైంది. ఓటీటీ మీడియా విస్తరించిన ఈ జమానాలో చెంచులక్ష్మి నాటకాన్ని మన ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి.. నాటకకర్త, నటుడు, దర్శకుడు దెంచనాల శ్రీనివాస్.
సామాన్యుల కథలే
కరోనా కాలంలో కూడా ప్రేక్షకులు చెంచులక్ష్మి నాటకాన్ని వీక్షించారంటే ఈ నాటకం గొప్పదనమేంటో, తెలంగాణ కళల ప్రత్యేకత ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేటి తరానికి మన కళల గొప్పదనం తెలియజేసే ప్రయత్నమే ఇది. వాటిని బతికించుకోవడం తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం ద్వారానే అది సాధ్యమని అంటున్నారు శ్రీనివాస్. ఇదే లక్ష్యం కోసం గత ముప్పయేండ్లుగా ‘జనపదం రిపర్టరీ’ని కొనసాగిస్తున్నాడు. 1984లో ఖమ్మం జిల్లా ఇల్లందులో జనపదం రిపర్టరీని స్థాపించారు. వేలకొద్ది ప్రదర్శనిలచ్చారు. సామాన్యులు, ఆణచివేతకు గురైనవారు, స్త్రీల గురించే శ్రీనివాస్ నాటకాలు ఉంటాయి. రెండు సంవత్సరాలు దేశమంతా తిరిగి నాటకంపై అవగాహన ఏర్పరచుకున్నారు.
జానపద రిపర్టరీ
నేటితరానికి జానపద కళారంగాల్లో శిక్షణ ఇచ్చి కళల ప్రాధాన్యాన్ని మరింతగా చాటాలని 1996లో ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. కూకట్పల్లి వివేకానంద నగర్లో గ్రామీణ, ఆదివాసి, పేద యువతీ యువకులకు సాహిత్య, నాటక, జానపద రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. చిందు యక్షగానాలైన, ఆదిశక్తి, సారంగధర, చెంచులక్ష్మిలను పునరుద్ధరించి ప్రదర్శిస్తున్నారు. చెంచులక్ష్మి నాటకం స్త్రీ పురుష సంఘర్షణ. ఆదివాసీ, ఆదివాసీయేతర సంఘర్షణ. కళాత్మకంగా దైవ, మానవ సంఘర్షణ కూడా అంటారాయన. ‘రిపర్టరీ’ అంటే ఆధునిక వృత్తి నాటక సంస్థ. ‘కళే ప్రపంచంగా బతుకుతున్న నేను కూకట్పల్లి స్లమ్ ఏరియాలో ఏర్పాటుచేసిన శిక్షణా కేంద్రానికి గత మూడు నెలలుగా కిరాయి కట్టక పోవడంతో తాళాలు వేసుకున్నారు. ‘ప్రభుత్వం ఆదుకుంటే వేరే ప్రాంతానికి శిక్షణాకేంద్రాన్ని తరలించి తెలంగాణ కళల ఖ్యాతిని ప్రపంచానికి చాటుతా’ అంటున్నారు శ్రీనివాస్.
అనేక ప్రదర్శనలు
పౌరాణిక నేపథ్యమున్న చెంచులక్ష్మి నాటకాన్ని యక్షగానంలో అద్భుతంగా చూపించారు శ్రీనివాస్. ఇదొక ఆదివాసీ స్త్రీ జీవిత నాటకం. చెంచులక్ష్మిపై సింహ ముఖుడైన శ్రీహరి మనసు పారేసుకొని ప్రేమలో పడతాడు. కానీ, చెంచులక్ష్మి ఒప్పుకోదు. దీంతో, ఆమె సౌందర్యాన్ని కీర్తిస్తాడు. ఫిదా అయిపోయిన ఆమె ‘పెండ్లికి ‘సరే’ అంటుంది. ‘నేను ఆదివాసీ మహిళను కదా? నా ప్రేమను నువ్వు పొందాలంటే నువ్వు కూడా ఆదివాసీగా మారాల్సిందే’ అని నిబంధన పెడుతుంది. తర్వాత పెండ్లి. ‘మంచి ప్రదర్శనలు ఇస్తే ప్రజలు ఆదరిస్తారు. కానీ, కళలు బతకాలంటే ప్రజల మద్దతు ఒక్కటే సరిపోదు. సినిమాల్లా నాటకాలనూ ఆదుకోవాలి, ఆదరించాలి.
ఇప్పటివరకు 59 నాటకాలను 1500 పైగా ప్రదర్శనలు ఇచ్చారాయన. దాదాపు 3వేల మంది యువతీ యువకుల కోసం సాహిత్య, రంగస్థల, జానపద శిక్షణ శిబిరాలను నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త పద్మభూషణ్ హబీబ్ తన్వీర్, బీవీ కారంత్, ప్రసన్నలతో కలిసి పనిచేసారు. దళిత, బహుజన, ఆదివాసీ సామాజికవర్గాల సంస్కృతులను, అణిచివేతలను, జీవనశైలులను, భాషలను ప్రతిబింబిస్తూనే క్లాసికల్ స్వభావాన్ని ఆయన నాటకాలు కలిగి ఉంటాయి. అవి గ్రామీణ నగర సంస్కృతుల మధ్య వారధిగా కనిపిస్తాయి.
అంతర్జాతీయ వేదికలపై
దంచెనాల శ్రీనివాస్ది వరంగల్ దగ్గర నెక్కొండ. చదువంతా ఖమ్మంలో సాగింది. వాళ్లనాన్న శిల్పాలు చేసేవారు. పద్యాలు పాడేవారు. అదే శ్రీనివాస్ను కళలవైపు ప్రయాణించేలా చేసింది. చదువు పూర్తయిన తర్వాత నాటకాలే అతడి జీవితంగా మారాయి. గత 37 సంవత్సరాలుగా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నాటకాలను దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. సారంగథర (చిందు యక్షగానం), యెల్లమ్మ, భస్మ సారంగి, బలి (గిరీష్ కర్నాడ్ నాటకానికి దెంచనాల అనుసృజన, పరికల్పన , దర్శకత్వం), మూగవాని పిల్లనా గ్రోవి (డాక్టర్ కేశవరెడ్డి నవల ఆధారంగా), ఆదిశక్తి (దళిత పురాణం ఆధారంగా) ఊరేగింపు (బాదల్ సర్కార్ నాటకం), మావ నాటే మావ రాజ్ ( గోండు జీవితాల ఆధారంగా), మట్టిబండి (ప్రపంచ ప్రఖ్యాత శూద్రకుడి ‘మృచ్ఛకటికం‘ అనువాదం), ఆది జాంబ పురాణం (దళిత జాంబ పురాణం) వంటి నాటకాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించారు.
ఇవీ కూడా చదవండి…