పెండ్లి రోజైనా ..పుట్టిన రోజైనా.. ఇంకో ఫంక్షనైనా ..కేక్ ఉండాల్సిందే.. కేక పెట్టాల్సిందే! కెమికల్ కేక్లు బంద్ చేయండి. ఫ్రెష్ ఫ్రూట్ కేక్స్ మాత్రమే ఆర్డర్ చేయండి. కేక్ కల్చర్కు సరికొత్త రుచులనద్దుతూ పార్టీని సెలబ్రేట్ చేసుకోండి.కేకులు కల్చర్లో భాగమయ్యాయి. ఏ ఫంక్షన్ అయినా తప్పనిసరి. ఇదే అదునుగా నాసికరకం కేకులతో మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం గురించి వ్యాపారులకు పట్టదు. నష్టం మనకే. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా వేదికగా దీని మీద ఓ ఉద్యమమే జరుగుతున్నది. హాయిగా పండ్లతో కేకులు చేసుకుంటే…రైతుకు లాభం, మనకు ఆరోగ్యం!
‘మహా’ రైతుల ఆలోచన
తాజా పండ్ల కేకుల ఆలోచన మహారాష్ట్ర రైతులది. ఆరుగాలం కష్టపడి పండ్లు పండించినా దళారులే లాభ పడుతున్నారు తప్ప, తాము బాగు పడటం లేదనేది రైతుల ఆవేదన. అందుకే ‘సంప్రదాయ కేకులకు స్వస్తి పలికి తాజా పండ్లతో చేసినవి మాత్రమే కొనుక్కోండి’ అని సూచిస్తున్నారు. ఏకంగా ‘ఫ్రెష్ ఫ్రూట్ కేక్ మూమెంట్’ను ప్రారంభించారు కొందరు వ్యవసాయ విశ్లేషకులు. సోషల్మీడియాలో ఈ ఉద్యమం వైరల్ అవుతున్నది. వీటిని స్థానికంగానే తయారుచేసుకోవచ్చు. ‘నాణ్యత, రుచి మనం కోరుకున్న విధంగానే ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు’ అని జనాలకు అర్థమయ్యేట్లుగా అవగాహన కల్పిస్తున్నారు.
పండ్లుకొనడం
ద్వారా ఓ రైతు ఆకలిని తీర్చినవాళ్లం అవుతాం. పోషకాలూ పోగేసుకుంటాం.
లాక్ డౌన్ నేర్పిన పాఠం
కరోనా లాక్డౌన్వల్ల మహారాష్ట్ర పండ్లరైతులు భారీగా నష్టపోయారు. కనీసం పెట్టిన పెట్టుబడికూడా రాలేదు. తీసేసి వేరే పంటలు వేయడానికి అవి కూరగాయల తోటలు కావు. ఏండ్ల తరబడి పెంచినవాయె. మరి ఈసారికూడా అలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలి? అనే ఆలోచనతో “ఫ్రెష్ ఫ్రూట్ కేక్ మూవ్మెంట్’ ద్వారా ఓ అడుగు వేశారు. కరోనా మిగిల్చిన నష్టాలనుంచి బయట పడాలన్నదే వారి ఆలోచన. దేశవ్యాప్తంగా ఉన్న పండ్ల రైతులకు ఈ చాలెంజ్ ఉపయోగపడాలని అనుకున్నారు. సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా ప్రచారం కల్పించారు. ఈ కాన్సెప్ట్ నచ్చడంతో అనూహ్య ఆదరణ లభిస్తున్నది. ఎవరి ట్వీట్ చూసినా ‘ఫ్రెష్ ఫ్రూట్ కేక్ మూవ్మెంట్’ ప్రస్తావనే ఉంటున్నది.
ఆరోగ్యాన్ని కాపాడే మార్గం
‘ఫ్రెష్ ఫ్రూట్ కేక్ మూవ్మెంట్’ రైతులను మాత్రమే పరిమిమైన ఉద్యమం కాదు. ప్రజలకు కూడా అవసరమే. కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ నడుస్తున్నది. అస్తమానం భయపడుతూ ఉండే బదులు, మనల్ని చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకుంటే కరోనా మనల్ని ఏమీ చేయలేదు. అందుకు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నారింజ, అంగూర, అరటి, పుచ్చపండ్లు, కర్బూజా వంటివి ఆరోగ్యానికి మంచివి. వీటిని నేరుగా తీసుకోవడంతోపాటు కేకుల్లోకూడా వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు వ్యవసాయ విశ్లేషకుడు దీపక్ చౌహాన్.
భరోసా కల్పించొచ్చు
‘ఫ్రెష్ ఫ్రూట్ కేక్’ చాలెంజ్లో పాల్గొనేవాళ్లు తాము తయారుచేస్తున్న లేదా కొనుక్కున్న తాజా పండ్ల కేకులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. మరొకరిని ఈ చాలెంజ్లో పాల్గొనేందుకు నామినేట్ చేయాలి. నిర్వాహకులకు కూడా ఎంట్రీ పంపాల్సి ఉంటుంది. అంతిమంగా విజేతను ప్రకటిస్తారు. ‘సోషల్మీడియా రైతులను ఆదుకునే వేదిక అవుతుందనే ధీమా కనిపిస్తుంది’ అని అంటున్నారు ‘ఫ్రెష్ ఫ్రూట్ కేక్ మూవ్మెంట్’ సభ్యుడు సాంగ్లీకి చెందిన అమోల్ పాటిల్.
ఇవీ కూడా చదవండి…
మహారాష్ట్ర సరిహద్దుల్లో కొవిడ్ స్పెషల్డ్రైవ్
డిఫాల్టర్లకు సైతం మరిన్ని రుణాలు