న్యూఢిల్లీ, మార్చి 31: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇంధన కొరతనుఎదుర్కొంటున్న దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు ప్రత్యామ్నాయాలు సూచించారు. అమెరికా నుంచి చమురు కొనండి లేదా ఇరాన్ అడ్డగించిన హొర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలు సాధించుకోండి అంటూ మంగళవారం యుద్ధ ప్రభావిత దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. యుద్ధంలో చేరాలంటూ తాను ఇచ్చిన పిలుపును తిరస్కరించిన మిత్రదేశాలపై ట్రంప్ మండిపడ్డారు. దేశాలు తమ కోసం తాము పోరాడటం నేర్చుకోవాలి. మిమ్మల్ని కాపాడేందుకు అమెరికా అక్కడ ఎప్పుడూ ఉండదు.
ఇరాన్ దాదాపుగా నాశనమైంది. ఒక కష్టమైన పని పూర్తయింది. వెళ్లి మీ చమురును మీరే తెచ్చుకోండి అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ను నిర్వీర్యం చేయడంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన బ్రిటన్సహా హొర్ముజ్ జలసంధి కారణంగా జెట్ ఇంధనం పొందలేని దేశాలన్నిటికీ నాదో సలహా. మొదటిది అమెరికా నుండి కొనండి. మా వద్ద పుష్కలంగా ఉంది. రెండవది కొంత ఆలస్యమైనా ధైర్యం కూడగట్టుకుని ఆ జలసంధికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకోండి అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు.
ఇరాన్తో యుద్ధం ఐదో వారానికి చేరుకోవడం.. ఈ సంక్షోభం అంతమయ్యే సూచనలు కన్పించకపోవడంతో ఎలాగైనా యుద్ధాన్ని ముగించేద్దాం అని ట్రంప్ యోచిస్తున్నారు. తాము ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి తెరదించాలని తాను భావిస్తున్నానని ఆయన తన సన్నిహితుల వద్ద పేర్కొన్నారని, ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్న హొర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతున్నా.. ఆ సమస్యను పక్కన పెట్టి యుద్ధాన్ని ముగించాలని భావిస్తున్నారని ఉన్నతాధికారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
ఇరాన్పై యుద్ధం కోసం కోట్లాది డాలర్లు ఖర్చు చేస్తున్న అమెరికా.. ఈ భారాన్ని గల్ఫ్ మిత్రదేశాలపై మోపేందుకు సిద్ధమవుతున్నది. అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న కోట్లాది డాలర్ల భారాన్ని తగ్గించుకొనేందుకు ట్రంప్ సరికొత్త ప్రతిపాదన చేసినట్టు తెలుస్తున్నది. అమెరికా చేస్తున్న వ్యయానికి సౌదీ అరేబియా, యూఏఈ వంటి సంపన్న అరబ్ మిత్ర దేశాల నుంచి రాబట్టాలని ట్రంప్ భావిస్తున్నారని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి.