వాషింగ్టన్, జూలై 15: ఇరాన్పై తన సైనిక చర్యలలో కొత్త దశకు అమెరికా తెరతీయనుంది. ఇన్నాళ్లు రాత్రిపూట దాడులకే పరిమితమైన అగ్రరాజ్యం చాలా రోజుల తర్వాత తొలిసారిగా బుధవారం పగటిపూట దాడులకు తెగబడింది. వచ్చే వారం పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. హొర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు పాల్పడుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా దాడులు నిర్వహించనున్నట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) బుధవారం వెల్లడించింది. అందులో భాగంగా ఉదయం ఆరు గంటలకే ఇరాన్పై దాడులను ప్రారంభించామని తెలిపింది. కాగా, ఇరాన్పై దాడుల విషయంలో అమెరికా వ్యూహం మార్చుకుంది. ఆక్సియోస్ కథనం ప్రకారం వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తదుపరి యుద్ధ దశను వివరించారు. ఇరాన్ పాలనా సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయాలనే లక్ష్యంతో పాటు ఆ దేశంపై సైనిక దాడుల విస్తరణపై అధికారులతో చర్చలు జరిపారు. ముఖ్యంగా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేలా, అణు కార్యక్రమంపై అమెరికా విధించే షరతులకు ఒప్పుకునేలా ఇరాన్పై దాడులను విస్తృతం చేయాలని ట్రంప్ భావిస్తున్నారు.
వచ్చే వారం ఇరాన్కు నరకమే
అణు కార్యక్రమంపై ఇరాన్ కనుక చర్చలకు అంగీకారం తెలపకపోతే వచ్చే వారం ‘ఆ దేశ పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ప్రస్తుతం హొర్ముజ్ జలసంధి, దాని పరిసర ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కార్యక్రమాలను విస్తరించి ఇరాన్పై విస్తృత సైనిక దాడి జరిపేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్న క్రమంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. కాగా, పికాక్స్ పర్వతం కింద ఉన్న అణు కేంద్రం లక్ష్యంగా దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఇప్పటివరకు సైనిక మౌలిక సదుపాయాలు, సముద్రయాన రక్షణ లక్ష్యంగానే ప్రధానంగా దాడులు జరిపామని, దీనిని విస్తరిస్తామని తెలిపారు. విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు, ఇతర వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
పశ్చిమాసియా నుంచి అన్ని ఎగుమతులను నిలిపివేస్తాం
తమపై దాడులకు నిరసనగా పశ్చిమాసియా నుంచి అన్ని ఇంధన ఎగుమతులను నిలిపివేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ బుధవారం హెచ్చరించింది. ‘ఈ ప్రాంతం నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులు అందరికీ ఉండాలి, లేకపోతే ఎవరికీ ఉండకూడదు’ అని పేర్కొంది. కాగా, బుధవారం ఉదయం అమెరికా జరిపిన దాడుల్లో 30 మంది పౌరులు మరణించగా, 260 మంది గాయపడ్డట్టు ఇరాన్ అధికార ప్రతినిధి ఫాతిమే మోహజేరాని వెల్లడించారు. అమెరికా జరిపిన దాడుల్లో ఏడుగురు సైనికులు మరణించినట్టు ఇరాన్ ఆర్మీ వేరొక ప్రకటనలో తెలిపింది. ఆగ్నేయ సిస్తాన్, బలూచిస్థాన్ ప్రావిన్స్లోని బంపూర్ కౌంటీలో ఉన్న భూతల దళాల స్థావరాలపై అమెరికా జరిపిన దాడిలో పలువురు గాయపడ్డారని వివరించింది. తమ గార్డు పోస్టులు, మిలిటరీ కేంద్రాలు, గెస్ట్హౌస్లపై 13 క్షిపణులు దాడి చేశాయన్నారు. కాగా, బహ్రెయిన్, జోర్డాన్లలో బుధవారం ఉదయమే ఇరాన్ దాడుల గురించి హెచ్చరికగా సైరన్లు మోగాయి. తాము మూడు ఇరాన్ క్షిపణులను నేలకూల్చినట్టు జోర్డాన్ ప్రకటించింది.