అబుదాబి: దేశంలో అత్యధిక శాతం మంది కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న లిస్ట్లో సీషెల్స్ను వెనక్కి నెట్టి తొలి స్థానానికి దూసుకెళ్లింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ). బ్లూమ్బర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం.. యూఏఈలోని జనాభాలో 72.1 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారు. కోటి జనాభా ఉన్న ఈ గల్ఫ్ దేశంలో ఇప్పటికే 1.55 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఇవ్వడం విశేషం. అదే సీషెల్స్ విషయానికి వస్తే తమ లక్ష జనాభాలో 71.7 శాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు.
తగ్గని కేసులు
తమ దేశంలోని మెజార్టీ జనాభాకు వ్యాక్సిన్లు ఇచ్చినా కూడా.. యూఏఈలో కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గత వారమే ఈ దేశంలో అత్యధిక స్థాయిలో కరోనా కేసులున్నాయంటూ అమెరికా ప్రయాణ హెచ్చరికలు కూడా జారీ చేసింది. సౌదీ అరేబియా కూడా తాత్కాలికంగా యూఏఈకి ప్రయాణాలను నిషేధించింది.
ఏఈలో ఫిబ్రవరి నెలలో అత్యధికంగా రోజుకు 4 వేల కేసులు నమోదు కాగా.. మార్చి నుంచి రోజుకు 2 వేల కేసులు వస్తున్నాయి. మిగతా దేశాలతో పోలిస్తే యూఏఈ ఎక్కువగా లాక్డౌన్లు విధించలేదు. రాజధాని అబుధాబిలో మాత్రమే కొన్ని ఆంక్షలు విధించారు. ఇప్పుడు వ్యాక్సిన్లు వేసుకున్న వారికైతే మొత్తంగా ఆంక్షలు ఎత్తేసే ఆలోచన చేస్తోంది.
ప్రస్తుతం యూఏఈలో ఫైజర్, ఆస్ట్రాజెనెకా, సినోఫామ్ వ్యాక్సిన్లు వేస్తున్నారు. సినోఫామ్ను స్థానికంగానే తయారు చేస్తుండటంతో ఆ వ్యాక్సిన్లనే ఎక్కువగా వేస్తున్నారు. పైగా ఇప్పటికే ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.