Protests in China | కరోనా మహమ్మారిని నియంత్రించడానికి చైనా అనుసరిస్తున్న వ్యూహం విమర్శల పాలవుతున్నది. తాజాగా గ్యాంగ్జౌ తదితర నగరాల్లో విధించిన కరోనా ఆంక్షల పట్ల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. గ్యాంగ్జౌలోని హైజు జిల్లాలో వందల మంది నిరసన ప్రదర్శలు చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గత నెల నుంచి లాక్డౌన్ కొనసాగడం పట్ల హౌజు జిల్లా వాసులు మండి పడుతున్నారు. ఉపాధి కోసం వలస వచ్చిన కార్మికులు జీవనం సాగిస్తున్న పట్టణాల్లో ఆంక్షలు విధించడానికి నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసన ప్రదర్శనలను అడ్డుకునేందుకు భారీగా పోలీస్ వాహనాలను మోహరించారు.
కొవిడ్-జీరో పాలసీ అమలు చేస్తున్న చైనా.. మూడేండ్లుగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఆంక్షలు, లాక్డౌన్లు విధిస్తుండటంతో ప్రజల ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. తప్పనిసరి క్వారంటైన్ పీరియడ్ తగ్గించడానికి, కొన్ని ఆంక్షలు మినహాయించడానికి కూడా అధికారులు ముందుకు రావడం లేదు. లాక్డౌన్లతో ఇండ్లకు పరిమితం కావడంతో చాలా మందికి సకాలంలో వైద్యం లభించడం లేదని, ఆహార వస్తువుల కొరతతో తాము పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాదని ఆందోళన కారులు చెబుతున్నారు.
సోమవారం గ్యాంగ్జౌలోని రెండు జిల్లాల్లో 5,124 మందికి కరోనా సోకడంతో లాక్డౌన్ విధించారు. దేశవ్యాప్తంగా 17 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ తర్వాత కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటికీ కొవిడ్ జీరో పాలసీకి కట్టుబడి ఉన్నామని చైనా ప్రభుత్వ మీడియా చెబుతున్నది.