హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : పోలీసు కస్టడీలో అక్రమ నిర్బంధం, చిత్రహింసల ఆరోపణలను అత్యంత పారదర్శకంగా విచారించాలని నగర పోలీసు కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. మలక్పేట పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తిని చట్టవిరుద్ధంగా అదుపులో ఉంచి హింసించారన్న ఆరోపణలపై ఆధారాలను పరిశీలించి బాధితుడు సమర్పించిన ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
పి. శ్రీకాంత్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ టి. మాధవీదేవి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కదిరే అజిత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, జూలై 17న పోలీసులు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని 24 గంటలకు మించి అక్రమంగా నిర్బంధంలో ఉంచారని, అనంతరం మాత్రమే రిమాండ్కు తరలించారన్నారు. నేరాన్ని అంగీకరించాలని ఒత్తిడి చేయడంతో పాటు, హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకోవాలని వేధించారన్నారు.
మలక్పేట స్టేషన్ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, బాధితుడికి పరిహారం కూడా అందించాలని కోరుతూ జూలై 21న డీజీపీ, నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. వాదనలను పరిశీలించిన హైకోర్టు, నిర్బంధ సమయంలోని సీసీటీవీ ఫుటేజీ, వైద్య ఆధారాలను తప్పనిసరిగా పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధితుడి వినతిపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని పోలీసు కమిషనర్ను ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్పై విచారణను ముగించింది.