బీజింగ్ : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని కబళిస్తున్న డయాబెటిస్ మహమ్మారికి చైనా పరిశోధకులు అద్భుత చికిత్సను అభివృద్ధి చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా స్టెమ్ సెల్ థెరపీ ద్వారా టైప్ 2 డయాబెటిస్ను నయం చేయగలిగారు. భద్రత, సామర్థ్యాల్ని నిర్ధారించడానికి మరిన్ని క్లినికల్ ట్రయల్స్ అవసరం. అయినప్పటికీ.. ఈ ప్రయోగ ఫలితం భారత్ సహా ప్రపంచ దేశాలకు శుభవార్త. టైప్-2 డయాబెటిస్ రివర్సల్. అంటే మందులు లేకుండా చక్కెర వ్యాధిని నియంత్రించటం, వెనక్కి తిప్పటం. రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావటం.
దాత నుంచి లేదా రోగి నుంచి స్టెమ్ సెల్స్ను సేకరిస్తారు. ల్యాబ్లో పాంక్రియాటిక్ ఐలెట్ సెల్స్గా మార్చుతారు. ఇవి బీటా సెల్స్గా మార్పు చెందుతాయి. శరీరంలో సహజ పద్ధతిలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేయటంలో ‘బీటా సెల్స్’దే ప్రధాన పాత్ర. పాంక్రియాటిక్లో దెబ్బతిన్న కణాల స్థానాన్ని ‘బీటా సెల్స్’ భర్తీ చేస్తాయి. ఈ వ్యవస్థ అంతటినీ అవయవ మార్పిడి ద్వారా పేషెంట్ శరీరంలోకి ఎక్కిస్తారు. దీనినే ‘స్టెమ్ సెల్’ థెరపీగా పేర్కొంటారు. దీంతో రోగికి మందులు, ఇంజెక్షన్ల అవసరం ఉండదు. అనేక దేశాలు దీనిపై ప్రయోగాలు చేస్తున్నా.. ప్రపంచంలో తొలిసారి చైనా సైంటిస్టులు దీంట్లో విజయం సాధించారు.
శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రించటంలో ఇన్సులిన్ పాత్ర కీలకం. అయితే ఈ ఇన్సులిన్ను శరీరం సరిగా ఉపయోగించుకోని పరిస్థితిలో ఉండటమే ‘టైప్-2 డయాబెటిస్’గా పేర్కొంటారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీసి.. బయటి నుంచి మందులు, ఇంజెక్షన్లు అవసరమవుతాయి. మందులు, ఇంజెక్షన్లు తీసుకోవటం మొదలయ్యాక డయాబెటిస్ రివర్సల్ అసాధ్యం.