వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ల తరలింపు ఈనెల చివరలోగా పూర్తి అవుతుందని అధ్యక్షుడు జో బైడెన్ ( Biden ) తెలిపారు. అయితే రద్దీగా ఉన్న కాబూల్ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశాలుఉన్నట్లు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఖర్జాయ్ విమానాశ్రయానికి జనం భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి హృదయవిదారకరంగా ఉంది. తాలిబన్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఆగస్టు 31వ తేదీ లోపు కాబూల్ నుంచి జనాల తరలింపు ముగుస్తుందని బైడెన్ అన్నారు. వైట్హౌజ్ నుంచి ఆయన మాట్లాడుతూ. . ఆ తేదీ పొడిగింపు కాదు అని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విదేశీ నేతలు మరింత సమయం అడుగుతున్నారని వేసిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఇప్పటి వరకు 28 వేల మందిని తరలించినట్లు బైడెన్ తెలిపారు. వేలాది సంఖ్యలో జనాలను తరలిస్తున్న సమయంలో ఆర్తనాదాలు, బాధలు తప్పవన్నారు. కాబూల్లో ఇస్లామిక్ స్టేట్కు చెందిన ఐఎస్ఐఎస్-కే గ్రూపుతో సమస్యలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అక్కడ ఉన్న పరిస్థితులను ఉగ్రవాదులు మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.