న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఈ ఏడాది ఎండాకాలంలో అమెరికా పర్యటనకు రావాల్సిందిగా మోదీని బైడెన్ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బైడెన్ ఆహ్వానాన్ని పీఎంవో కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మోదీ అమెరికా పర్యటన తేదీల విషయంలో ఇరు దేశాల నేతలు కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
జీ-20 సదస్సుకు ఈ సంవత్సరం భారత్ ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ నెలలో పలు కీలక సమావేశాలు భారత్లో జరగనున్నాయి. ఈ సమావేశాలకు బైడెన్ సహా ఇతర దేశాధినేతలు భారత్కు రానున్నారు. అంతకు ముందే మోదీ అమెరికాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. జూన్ లేదా జులై నెలల్లో మోదీ పర్యటన ఉండొచ్చని సమాచారం.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. అమెరికా పర్యటన సందర్భంగా యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం వైట్ హౌస్లో జరగనున్న విందులో కూడా పాల్గొంటారు. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. 2021 సెప్టెంబరు నెలలో ప్రధానమంత్రి వాషింగ్టన్లో పర్యటించారు. ఆ సమయంలో మోదీ.. బైడెన్తో తన తొలి ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించారు.