Tarique Rahman : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ ఇండియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. బంగ్లాదేశ్కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించాడు. ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వీసాల జారీ రెండు నెలలక్రితం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగాయి.
అలాగే ఇండియాలో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రెండు దేశాల మధ్య వీసాల జారీ ఆగిపోయింది. ఇటు ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో, అటు ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలో వీసాల జారీ నిలిచిపోయింది. అయితే, తాజాగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తారిఖ్ రహమాన్ మూడు రోజుల్లోనే ఇండియాతో సంబంధాల విషయంలో సానుకూలంగా స్పందించాడు. వీసాలు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
దీంతో ఢిల్లీలో శుక్రవారం ఉదయం నుంచి బంగ్లా రాయబార కార్యాలయంలో అన్ని రకాల వీసాల మంజూరు సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఢాకాలో కూడా బంగ్లా నుంచి ఇండియాకు వచ్చేందుకు వీసాల సేవల్ని పునరుద్ధరిస్తామని అనిరుద్ధా దాస్ అనే బంగ్లాలోని భారత రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. మెడికల్, టూరిజం వంటి అన్ని రకాల వీసా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక.. బంగ్లాలో తారిక్ ప్రమాణ స్వీకారానికి ఇండియా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. తాజాగా తారిక్ ఇండియాతో సంబంధాల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నాడు. దీంతో త్వరలో రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగవుతాయని విశ్లేషకుల అంచనా.