Ayatollah Ali Khamenei : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని అంత్యక్రియలు టెహ్రాన్లో ఉద్విగ్న వాతావరణంలో కొనసాగుతున్నాయి. పలువురు ఖమేని సన్నిహితులు, నేతలు, ప్రజలు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని సన్నిహితుడు, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా ఖమేని అంత్యక్రియల సందర్భంగా ఆయన ముగ్గురు కొడుకులు ఏడుస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఖమేనికి మొజ్తాబాతోపాటు మరో ముగ్గురు కొడుకులున్నారు.
వారు మొస్తాఫా ఖమేని, మెయ్సమ్ ఖమేని, మసౌద్ ఖమేని. వీరు తమ తండ్రి అయతొల్లా ఖమేని అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ తండ్రి శవపేటికను చూసి ముగ్గురూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఖమేని కొడుకు, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని మాత్రం ఈ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. భద్రతా కారణాలరీత్యా ఆయనను ప్రభుత్వం అనుమతించలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఖమేని, అతడి కుటుంబ సభ్యుల మృతదేహాలున్న శవపేటికలు టెహ్రాన్లోని ఇమామ్ ఖొమేని గ్రాండ్ మొసాల్లా వద్ద ఉంచారు. అక్కడికి ప్రజలతోపాటు నేతలు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. వారంపాటు సాగనున్న ఖమేని అంత్యక్రియలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు ఈ పేటికల్ని ఇండోర్లోనే ఉంచారు. విదేశీ ప్రతినిధులు, ఇరాన్ కీలక నేతలు, అధికారులు వంటి వారికి మాత్రమే నివాళులు అర్పించే అవకాశం దొరికింది.
రెండో రోజు పేటికల్ని బయటకు తీసుకొచ్చి, బహిరంగంగా ఉంచారు. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాలకు లక్షలాది మంది ఇరాన్ ప్రజలు తరలివస్తు్న్నారు. ఇది దేశ ప్రజల ఐక్యతకు నిదర్శనం అని ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 9న ఖమేని అంత్యక్రియలు పూర్తవుతాయి. గత ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన దాడిలో ఖమేని, అతడి కుటుంబ సభ్యులు మరణించారు. ఖమేని కూతురు, అల్లుడు, 14 నెలల మనవరాలు, కోడలు కూడా ఉంది. వీరందరికీ ఒకేసారి అంత్యక్రియలు జరుగుతున్నాయి.