వాషింగ్టన్: చంద్రుడిపై తొలిసారి మానవుడు కాలుమోపిన దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ జాబిల్లిని చేరే క్షణం రాబోతున్నది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టెమిస్-2’ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములను చందమామ చెంతకు పంపించబోతున్నది. వచ్చే నెల 6న ఈ ప్రయోగం చేపట్టనున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది. అపోలో ప్రోగ్రామ్ 1972లో ముగిసిన తర్వాత తొలి మానవ సహిత మిషన్ ఇది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 14 వరకు లాంచ్ విండో ఓపెన్ అయి ఉంటుందని, నెల 6న ఈ ప్రయోగం జరగకపోతే, వచ్చే నెల 7, 8, 10, 11 తేదీల్లో ఏదో ఒక రోజు జరగవచ్చునని నాసా తెలిపింది. ఈ మిషన్లో నాసా వ్యోమగాములు రీడ్ వైజ్మేన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి జెరెమీ హాన్సెన్ వెళ్తారు. 10 రోజులపాటు చంద్రుని చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత భూమిపైకి వస్తుంది. ఇది చంద్రుని చుట్టూ కక్ష్యలో తిరగదు, చంద్రునిపై దిగదు. లైఫ్ సపోర్ట్ పరికరాలను పరీక్షించడం కోసం కొన్నిసార్లు భూమి కక్ష్యలో తిరుగుతుంది. మానవులు చంద్రునిపై మరోసారి అడుగుపెట్టడానికి ముందు, ఇది ట్రయల్ మిషన్. ఆర్టెమిస్-3 మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లి, దించుతుంది.