Anura Kumar Dissanayake | శ్రీలంక తదుపరి అధ్యక్షుడిగా (Sri Lankan president) మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (Anura Kumar Dissanayake) (56) ఎన్నికైన విషయం తెలిసిందే. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. శనివారం జరిగిన త్రిముఖ పోరులో ఓటర్లు అనుర కుమారకే పట్టం కట్టారు. దీంతో శ్రీలంక తదుపరి అధ్యక్షునిగా దిసనాయకే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిసనాయకే ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణ స్వీకారం చేయించారు.
కాగా, శనివారం జరిగిన ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతానికిపైగా ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి ఈ ఫలితాన్ని ప్రకటించారు. దిస్సనాయకే మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ నేత. మరికొన్ని పార్టీలతో కలిసి నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు. సమగి జన బలవేగయ (ఎస్జేబీ) నేత సాజిత్ ప్రేమదాసపై దిసనాయకే గెలిచారు. ఇక లంకకు 9వ అధ్యక్షుడిగా ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 24 ఏండ్ల తర్వాత అధ్యక్ష పీఠంపై కమ్యూనిస్ట్ నాయకుడు కూర్చోవడం విశేషం.
శనివారం జరిగిన ఎన్నికల్లో 22 జిల్లాల పరిధిలోని 13,400కి పైగా పోలింగ్ కేంద్రాల్లో 1.70 కోట్ల మంది ఓటర్లలో 75 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన దిసనాయకే ప్రభుత్వం.. శ్రీలంకకు ఐఎంఎఫ్ ఇచ్చిన 2.9 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓట్లు కురిపించిన నినాదం
గత ఏడాది అంతర్గత సంక్షోభంతో అట్టుడికిన శ్రీలంకలో ప్రజలు మార్పు కోరుకున్నారు. 1980 తర్వాత మరోసారి కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అవినీతికి తావులేని ‘స్వచ్ఛమైన పాలన’ నినాదంతో ఎన్నికల్లో పోటీ పడిన అనుర కమార ఓటర్లను ఆకర్షించారు. విక్రమసింఘే పాలనలో గాడీ తప్పిన ఆరోగ్యం, విద్యా, రవాణా రంగాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవన్నీ అనుర కుమార పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాయి.
విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగి…
శ్రీలంక రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన అనుర కుమార దిసనాయకే డిగ్రీ చదువుతున్నప్పుడు సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరి, విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1987లో మార్క్సిస్ట్ ప్రభావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీలో చేరారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. శ్రీలంకలో 2022లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలచుకున్నారు. మార్పు, అవినీతి రహిత సమాజ నిర్మాణం వంటి నినాదాలతో జనాదరణ పొందారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి, వైఫల్యాల గురించి వివరించడంతోపాటు, దేశంలో జవాబుదారీతనం, వ్యవస్థాగత మార్పులు రావాలని గట్టిగా చెప్పారు.
Also Read..
Donald Trump | ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయను.. ట్రంప్ కీలక ప్రకటన
MLA Sunitha Lakshma Reddy | ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై కాంగ్రెస్ మూకల దాడి
BRS | రాజయ్య కమిటీ హౌస్ అరెస్ట్.. గాంధీ దవాఖానకు వెళ్లకుండా నిర్బంధం