Saudi prince | జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజుకు ఊరటనిచ్చే వార్తను అమెరికా ప్రకటించింది. ఈ కేసులో విచారణ నుంచి సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్కు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు వైట్హౌస్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం.. ఖషోగ్గి హత్య కేసుకు సంబంధించి యువరాజుపై అమెరికా విచారణ జరుపదు. జో బైడెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికాలో సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఓ దేశాధినేతకు మినహాయింపు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
అమెరికా-సౌదీ అరేబియా దేశాల మధ్య సంబంధాలు గత కొంత కాలంగా ఫర్వాలేదు. ఈ సంబంధాన్ని మళ్లీ ట్రాక్లోకి తీసుకురావడానికి ప్రిన్స్ సల్మాన్కు ఖషోగ్గి హత్యకేసులో విచారణకు అమెరికా మినహాయింపు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఈ మినహాయింపు నిర్ణయం ఇరు దేశాల మధ్య సంబంధాలకు ఎలాంటి సంబంధం లేదని వైట్హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ చెప్తున్నారు. ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తులను తగ్గించాలని నిర్ణయించిన నేపథ్యంలో అమెరికా-సౌదీ అరేబియా మధ్య సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునరాలోచిస్తున్నారని ఆయన అన్నారు.
వాషింగ్టన్ పోస్ట్కు చెందిన సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గిని హతమార్చే ప్రణాళికను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆమోదించినట్లు అమెరికా నివేదిక పేర్కొన్నది. సౌదీ అరేబియాకు ఖషోగ్గిని ముప్పుగా యువరాజు భావించారని ఆ నివేదిక వెల్లడించింది. కాగా, సల్మాన్ మాదిరిగానే గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా అమెరికా మినహాయింపు ఇచ్చింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో 2014 లో మోదీపై అమెరికా ట్రావెల్ బ్యాన్ విధించింది. మోదీ ప్రధాని అయ్యాక ఈ ట్రావెల్ బ్యాన్ ఎత్తివేయడంతో ఆయనకు ఊరట లభించింది.