వాషింగ్టన్, డిసెంబర్ 23: అమెరికాను మంచుతుఫాన్ వణికిస్తున్నది. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని కనిష్ఠ ఉష్ణోగ్రతలు అక్కడ నమోదవుతున్నాయి. మంచుతుఫాన్ కారణంగా అమెరికాలో రెండు వేలకు పైగా విమానాలను రద్దు చేశారు. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నది. చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. క్రిస్మస్ వారాంతం వరకు ఇదే పరిస్థితి కొకసాగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంచు కారణంగా ఇప్పటికే పలు రహదారులను మూసివేశారు. బయటకు వెళ్తే గడ్డకట్టుకు పోయే ప్రమాదముందని హెచ్చరికలు చేశారు.
క్రిస్మస్ వేడుకలను తమవారితో గడపడానికి ముందుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న వారు విమానాల రద్దుతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 2,200 విమానాలను రద్దు చేశామని, మరో 900 విమాన సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మంచు తుపాను నేపథ్యంలో అమెరికా వాసులు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు జో బైడన్ కోరారు. గత 40 ఏండ్లలో ఎన్నడూ చూడని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.