Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ను ప్రకృతి వణికిస్తోంది. ఒక పక్క మంచు తుఫాన్, మరో పక్క భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి కారణంగా మూడు రోజుల వ్యవధిలోనే 61 మందికిపైగా మరణించారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (ఏఎన్డీఎమ్ఏ) శనివారం వెల్లడించింది.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులలో సెంట్రల్, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో మంచు తుఫాన్, భారీ వర్షాలు విలయం సృష్టించాయి. వరదలు, మంచు చరియలు విరిగిపడటం, ఇండ్లు కూలిపోవడం వంటి ఘటనల వల్ల దాదాపు 61 మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు కూడా ఉన్నారు. 110 మందికిపైగా గాయపడ్డారు. 458 వరకు ఇండ్లు ధ్వంసమయ్యాయి. 360కిపైగా కుటుంబాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. అలాగే అనేక చోట్ల రోడ్లు పాడైపోయాయి. మరోవైపు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకు పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది.
మంచు కురిసే ప్రాంతాల్లో ప్రజలు ఇండ్లనుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు. రోడ్లు కొట్టుకుపోవడం వల్ల చాలా ప్రాంతాలకు రవాణా నిలిచిపోయింది. అనేక ప్రాంతాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. ఈ దేశానికి విద్యుత్ అందించే ఉజ్బెకిస్తాన్ పవర్ లైన్స్ కూడా కొట్టుకుపోయాయి. ప్రస్తుతం తమకు మానవతా సాయం అవసరమని అక్కడి అధికారులు అంటున్నారు. ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాలు స్పందించాలని కోరుతున్నారు.