హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సేవలు
ముంబై, ఏప్రిల్ 24: దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ.. హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా 19 నగరాల్లో సంచార ఏటీఎం సేవలను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్ విజృంభణ, పాక్షిక లాక్డౌన్లు, ఇతర ఆంక్షల నేపథ్యంలో ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వ్యాన్ల ద్వారా ఈ మొబైల్ ఏటీఎంలను తీసుకువచ్చామని శనివారం బ్యాంక్ తెలిపింది. ఈ సంచార ఏటీఎంలతో నగదు ఉపసంహరణ కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదన్నది. కాగా, మొత్తం 15 రకాల లావాదేవీలను ఈ మొబైల్ ఏటీఎంలలో ఖాతాదారులు పూర్తి చేయవచ్చు. రోజుకు 3-4 స్టాప్స్తో ఒక్కో చోట నిర్ణీత సమయం మేరకు ఈ సంచార ఏటీఎంలు ఆగి ఉంటాయి. దీంతో ఎవరైనా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. ‘మా మొబైల్ ఏటీఎంలు ఈ కష్ట కాలంలో ప్రజలకు ఎంతగానో ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం’ అని హెచ్డీఎఫ్సీ ప్రతినిధి ఎస్ సంపత్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలను అనుసరించే ఈ ఏటీఎంలను నిర్వహిస్తున్నామని, కస్టమర్లనూ అనుమతిస్తున్నామని చెప్పారు. గతేడాది కూడా దేశవ్యాప్తంగా 50కిపైగా నగరాల్లో బ్యాంక్ ఈ మొబైల్ ఏటీఎంలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై, అలహాబాద్, సేలం, హోసూర్, భువనేశ్వర్, కోయంబత్తూర్, డెహ్రాడూన్ తదితర నగరాల్లో ఈ సేవలను తెచ్చింది.