earthquake : భూటాన్లో ఆదివారం రాత్రి సమయంలో భూకంపం సంభవించింది. 5.6 తీవ్రతతో ఈ భూకంపం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప ప్రభావం భూటాన్, ఇండియాతోపాటు బంగ్లాదేశ్, నేపాల్, చైనాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించింది. ఈ విషయాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్జడ్) వెల్లడించింది. ఇండియాలోని అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ ప్రభావం కనిపించింది.
ఇండియాకు సంబంధించి అసోంకు 252 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 11.06 నిమిషాల సమయంలో భూటాన్లోని పునాఖా ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. అక్కడ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారికి ఈ అలర్ట్ కూడా జారీ అయింది. భూటాన్లోని పునాఖా ప్రాంతంలోని పది కిలోమీటర్ల పరిధిలో భూకంపం సంభవించింది. అక్కడ ఇండ్లు వణకడం గుర్తించిన ప్రజలు ఇండ్లను వదిలి బయటకు వచ్చేశారు. అసోం, మేఘాలయతోపాటు హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రజలు భూకంప తీవ్రతను అనుభవించారు. భూకంప భయంతో స్తానికులు ఇండ్లు వదిలి బయటే ఉంటున్నారు. భూటాన్ హిమాలయ భూకంప పరిదిలో ఉండటం వల్ల ఆ దేశంలో కూడా దీని ప్రభావం ఉంటుంది. ఇండియన్, యురోనేషియన్ టెక్టోనిక్ పలకలు ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉంది.
అందువల్లే తరచూ హిమాలయాల సమీపంలో భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి సమయంలో ప్రజలు అనవసరంగా ఆందోళనకు గురవ్వడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. భూకంపాలు సంభవిస్తే ముందుగా ప్రశాంతంగా వ్యవహరించడం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. అలాంటప్పుడు దీన్నుంచి ఎలా బయటపడగలమనే విషయాన్ని ఆలోచించగలుగుతాడు. అలాగే, భయంతో పరుగెత్తడం వల్ల కూడా ప్రమాదాలు జరిగి గాయపడొచ్చు. ఇలాంటి సమయంలో బిల్డింగుల్లో ఉండేవారు లిఫ్టులు వాడకుండా మెట్లను మాత్రమే ఉపయోగించాలి.