Human Trafficking | మానవ అక్రమ రవాణా (Human Trafficking) జరుగుతోందన్న సమాచారంతో 303 మంది భారతీయులతో (Indian Passengers) నికరాగువా (Nicaragua) వెళుతున్న విమానాన్ని ఫ్రాన్స్ (France)లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. గత వారం లెజెండ్ ఎయిర్ లైన్స్ విమానం ఫ్రాన్స్లో వాట్రీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు దిగిన సమయంలో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ప్రయాణికులంతా ఫ్రాన్స్ అధికారుల ఆధీనంలో ఉన్నారు. అయితే తాజాగా ఈ విమానం తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు అనుమతి లభించినట్లు సమాచారం.
ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నివేదిక ప్రకారం.. 303 మంది భారతీయులతో ఉన్న ఈ విమానం ఫ్రాన్స్ను వీడేందుకు అనుమతి లభించింది. అయితే, ఈ విమానం ఎటు వెళ్తుందన్న దానిపై స్పష్టత లేదు. షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానమైన నికరాగువా వెళ్తుందా..? లేక భారత్కు వస్తుందా..? లేదంటే దుబాయ్కి తిరిగి వెళ్తుందా..? అన్నది తెలియరాలేదు.
కాగా, రొమానియన్ కంపెనీ లెజెండ్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న ఏ340 విమానం 303 మంది భారతీయ ప్రయాణికులతో గురువారం దుబాయ్ నుంచి నికరాగువాకు బయలుదేరింది. ఈ క్రమంలో ప్యారిస్కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్లోని వాట్రీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు విమానం ల్యాండ్ అయ్యింది. అయితే, ‘మానవ అక్రమ రవాణా’ జరుగుతోందన్న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అందిన సమాచారంతో విమానాన్ని ఫ్రాన్స్ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులను రెండు రోజుల పాటు ఎయిర్పోర్టులోనే అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం తాజాగా విమాన ప్రయాణానికి పూర్తి అనుమతులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. ప్రయాణికుల్లో 11 మంది చిన్నారులు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.
Also Read..
Paytm Layoffs | 1,000 మందికిపైగా ఉద్యోగుల్ని తొలగించిన పేటీఎం
Dense Fog | ప్రతికూల వాతావరణ పరిస్థితులు.. శంషాబాద్కు రావాల్సిన ఐదు విమానాలు దారి మళ్లింపు