కాబూల్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో (Kabul) దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఖైర్ ఖానా ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో (Mosque) ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. దీంతో మసీదు ఇమామ్ సహా 20 మంది మరణించారు. కనీసం 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
బుధవారం సాయంత్రం మసీదులో ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా భారీ పేలుడు శబ్ధం వినిపించిందని, పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల కిటికీలు ధ్వంసమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటివరకు పేలుళ్లకు బాధ్యత విహిస్తూ ఏ సంస్థా ప్రకటించలేదని వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని కాబూల్ పోలీస్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ చెప్పారు.