Pakistan : పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఆందోళనలు ఆగడం లేదు. నిరసనకారులకు, పాక్ ఆర్మీకి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 16 మంది మరణించగా, 37 మందికి పైగా గాయపడ్డారు. పీవోకే పరిధిలోని రావల్కోట్లోని ఈద్గా గ్రౌండ్లో ఆందోళనకారులు నిరసనలు చేస్తుండగా, వారిపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది.
నిరాయుధులైన వేలమంది ఇక్కడ ఆందోళన చేస్తుండగా వారిపై పాక్ ఆర్మీ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ప్రజలకు సరైన హక్కులు దక్కడం లేదు. దీంతో అక్కడివారు తమకు తక్కువ ధరకే బియ్యం, పిండి, విద్యుత్ వంటివి అందించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనల్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం హింసాయుత చర్యలకు దిగుతోంది. తాజా ఘటనకు సంబంధించి గురువారం 60,000 నుంచి 70,000 మంది స్థానికులు ఇక్కడ సమావేశమయ్యారు. పురుషులు, స్త్రీలు, యువత సహా అందరూ ఆందోళన చేస్తుండగా ఆర్మీ కాల్పులు జరిపింది.
ఘటన తర్వాత ఆ ప్రదేశమంతా రక్తపు మరకలతో నిండిపోయింది. గత శుక్రవారం నుంచి పీవోకేలో ఆందోళనకారులపై పాక్ జరిపిన కాల్పుల్లో 57 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. పాక్ ఆర్మీ ఇంతగా అణచివేస్తున్నా అక్కడి ప్రజలు తమ ఆందోళనల్ని విరమించడం లేదు. తమకు హక్కులు కావాలని, ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పాక్ ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నారు. ఆర్మీ సిబ్బంది తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తూ దాడులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు.