సిటీబ్యూరో/మాదాపూర్, జూలై 15 (నమస్తే తెలంగాణ): సైబరాబాద్ పరిధిలో మరోసారి పాత కక్షలు పడగ విప్పుతున్నాయి. గత కొంతకాలంగా హత్యలు, అత్యాచారాలు వంటి నేరాలు పెరుగుతుండటంతో కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా పాత కక్షలతో జరుగుతున్న దారుణాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మంగళవారం రాత్రి మాదాపూర్ ఠాణా పరిధిలో జరిగిన యువకుడి హత్య స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పర్పల్లి గ్రామానికి చెందిన సెనేపల్లి భాస్కర్ (32) మాదాపూర్ ధ్రువ కాలేజ్ సమీపం లోని శ్రీశ్రీ సూట్స్(నోమా) హోటల్లో వర్కర్గా పనిచేస్తూ నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా భాస్కర్ హనుమకొండకు చెందిన రాజు కూతురిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ప్రేమిస్తున్నానని వెంటపడటంతో యువతి కుటుంబసభ్యులు భాస్కర్ను మందలించడంతోపాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం యువతికి వివాహం చేశారు. అయినప్పటికీ భాస్కర్ సదరు యువతికి మెసేజ్లు పంపడం, ఫోను చేస్తుండటతో భర్త ఆ యువతికి విడాకులు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా భాస్కర్ యువతి సోదరిని కూడా వేధించడం మొద లుపెట్టాడు. భాస్కర్ కారణంగా తన కూతురు కాపురం పాడైపోయిందని బాధపడుతున్న యువతి తండ్రి రాజు అతడిపై కక్ష పెంచుకున్నాడు.
తన రెండో కూతురిని కూడా వేధిస్తున్నట్లు తెలియడంతో ఆగ్రహించిన రాజు తన బావమరిది కుమారస్వామితో కలిసి భాస్కర్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాజు, కుమారస్వామి మరో ఇద్దరు బంధువులతో కలిసి మంగళవారం రాత్రి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. మాదాపూర్లోని హోటల్కు చేరుకుని భాస్కర్పై ఒక్కసారిగా కర్రలు, కత్తులతో దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన అతడు అపస్మారక స్థితికి చేరుకోగా నిందితులు పరారయ్యారు. పోలీసులు చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం కొండాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే భాస్కర్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.