హిమాయత్నగర్, ఫిబ్రవరి 16: ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె జీవిత సహచరుడు రచయిత రామకృష్ణారెడ్డి (62) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఇంట్లోనే కుప్పకూలి పోయాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన హైదర్గూడలోని అపోలో దవాఖానకు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. చిట్యాల సమీపంలోని నేరడ గ్రామంలో ఉన్న వారి వ్యవసాయ క్షేత్రంలో శనివారం అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ విషాద ఘటనను తెలుసుకున్న పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు, ప్రముఖులు హిమాయత్నగర్లోని రాయల్ సిగ్నేచర్ అపార్ట్మెంట్లో ఉన్న వారి నివాసం వద్ద రామకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులర్పించి.. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిం చారు.
నివాళి అర్పించిన వారిలో మీడియా అకాడమి మాజీ చైర్మన్ అల్లం నారాయణ, పద్మశ్రీ అవార్డు గ్రహీత వై.వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, పి.సూర్యం, వేములపల్లి వెంకటరామయ్య, గోవర్ధన్, కె.రమా, సీపీఎం నాయకులు ఎస్.వీరయ్య, భిక్షమయ్య, రాములు, సీపీఐ నాయకులు పశ్యపద్మ, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డి.సుధాకర్, జర్నలిస్టు శ్రీనివాస్, మహిళా నాయకురాలు జ్యోతి, పద్మకుమారి, రమా మేల్కోటే, సంధ్య, సజయ, విమల, రాష్ట్ర జన సమితి పార్టీ నగర అధ్యక్షుడు నర్సయ్యతో పాటు ప్రజాస్వామిక వాదులు ఉన్నారు.