మియాపూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Gandhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్లకు చెందిన ఇంజినీరింగ్ అధికారులు కార్పొరేటర్లతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు.
నియోజకవర్గంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనుల అమలులో జాప్యాన్ని ఎట్టి పరిస్థితులలో సహించబోనని స్పష్టం చేశారు. ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసుకున్న పనులన్నింటినీ పూర్తి చేయాల్సిందేనని సూచించారు. రహదారులు(Roads), నాలాల విస్తరణ, పార్కుల(Parks) సుందరీకరణ , డ్రైనేజీల నిర్మాణాలతో సహా ఇతర మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయాలన్నారు.
ఈ సమీక్షలో కార్పొరేటర్లు రాగం నాగేందర్యాదవ్, హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్రెడ్డి , సింధు ఆదర్శ్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎన్క్లేవ్లో రూ .90 లక్షలతో నాలాపై నిర్మిస్తున్న కల్వర్టు పనులను కార్పొరేటర్ మాధవరం రోజాదేవి, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పరిశీలించారు.