Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) :పార్ట్టైమ్ ఉద్యోగమంటూ వచ్చిన మెసేజ్కు స్పందించిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.20 లక్షలు పోగొట్టుకున్నది. బంజారాహిల్స్కు చెందిన బాధితురాలు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో అంకిత, హెచ్ఆర్ మేనేజర్ అనే పేరుతో బాధితురాలి ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కు ఆమె స్పందించి అందులో లింక్ను క్లిక్ చేయడంతో వాట్సాప్లోకి వెళ్లింది. వాట్సాప్లో యూట్యూబ్ లింక్లు క్లిక్ చేయడమే ఉద్యోగమని, రోజు ఎన్ని చేసుకుంటే అంత మొత్తంలో డబ్బులొస్తాయంటూ నమ్మించారు.
ఆ తరువాత ఓ యాప్ను డౌన్లోడ్ చేయించి అందులో తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టించి యూట్యూబ్ లింక్లను క్లిక్ చేసే టాస్క్ను అప్పగించారు. దీంతో బాధితురాలు మొదట తక్కువ పెట్టుబడికి మంచి లాభాలొచ్చాయి. దీంతో నమ్మకం పెరిగి నెమ్మదిగా పెట్టుబడి పెంచుతూ వెళ్లింది. అయితే యాప్లో స్క్రీన్పై లాభాలు కన్పిస్తున్నా వాటిని డ్రా చేసుకునే వీలు లేకుండా పోయింది. రూ. 20 లక్షలు పెట్టుబడి పెట్టిన తరువాత కూడా అదే పరిస్థితి ఉండటంతో ఇదంతా మోసమని గుర్తించి సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.