శంషాబాద్ రూరల్, డిసెంబర్ 20 : వైద్యుల(Doctors) నిర్లక్ష్యంతోనే మహిళ మృతి(Woman died) చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణం(Shamshabad)లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలంలోని డబిల్గూడ గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ తన గర్భసంచి సమస్యతో బాధపడుతు మూడు రోజుల క్రితం శంషాబాద్ పట్టణంలోని సైన్రైస్ దవాఖానలో చేరిన్నట్లు తెలిపారు. దీంతో వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స నిర్వహించారు.
చికిత్స చేసే సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆమె మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు బుధవారం ఉదయం తెలియడంతో వారు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.