కాచిగూడ,ఆగస్టు 18 : తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట డివిజన్లకు చెందిన 37 పేద కుటుంబాలకు రూ.37,04,292 రూపాయల కల్యాణాలక్ష్మి చెక్కులను బుధవారం ఎమ్యెల్యే వెంకటేశ్, కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి, నల్లకుంట కార్పొరేటర్ అమృత, హిమయత్నగర్ తాసీల్దార్ లలితతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్యెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణను ఏడేండ్లలోనే అభివృద్ధి చేయడంతో సీఎం కేసీఆర్ పాలనపై యావత్ ప్రజానీకం నీరాజనం పలుకుతున్నారని ఆయన పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పొరుగు రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఆయన అన్నారు.
రూ.200 నుంచి రూ.1000 పింఛన్లు, వికలాంగులకు రూ.500నుంచి 1500 ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. హాస్టల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నత చదువులు చదవి పురోగతి సాధించాలనే ఉద్దేశంతో సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన అన్నారు.
తెలంగాణ పేద ప్రజల కన్నీళ్లు తుడవడానికే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెలుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కన్నె రమేశ్యాదవ్, డిప్యూటీ తహసీల్దార్ ఆసీఫ్ఖాన్, స్సెషల్ ఆర్ఐ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.