KTR | ఈ రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేర్లు మార్చడం తప్ప చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. టీఎస్ను టీజీగా మార్చారని తెలిపారు. దానివల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి.. కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ రాజముద్ర నుంచి చార్మినార్ను తీసేస్తానని అంటున్నాడని తెలిపారు. ఇప్పటికే కాకతీయ కళాతోరణాన్ని తీసేశారని పేర్కొన్నారు. దిక్కుమాలిన తుగ్లక్ పనులు తప్ప.. రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మీకు అధికారం ఇచ్చింది ప్రజల హక్కులు కాపాడటానికి అని రేవంత్ సర్కార్కు సూచించారు. కానీ మీరు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. రెండేళ్లలో హైదరాబాద్లో ఒక్క కొత్త రోడ్డు వేశావా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఒక్క ఫ్లై ఓవర్ కట్టావా? అని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు. సికంద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసిన పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోతుందని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఐడెంటిటీని తొలగించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై ర్యాలీకి సిద్ధమయ్యారని తెలిపారు. పార్టీలకు అతీతంగా శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని అన్నారు. శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీని కూడా ఆహ్వానించారని తెలిపారు. మా ప్రజాప్రతినిధులమంతా సంఘీభావం తెలుపుదామని సిద్ధమయ్యామని పేర్కొన్నారు. కానీ వేలాది మందిని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారని తెలిపారు. తమను కూడా తెలంగాణ భవన్లో నిర్బంధించారని చెప్పారు. అరెస్టులు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడుతామని తెలిపారు. కోర్టు పర్మిషన్తో బ్రహ్మాండంగా మళ్లీ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బిడ్డల మనోభావాలను బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. అరెస్టు చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పరిపాలన వికేంద్రీకరణ కోసం కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు తీసుకొచ్చారని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని అన్నారు. హైదరాబాద్లో నాలుగు జోన్లు ఉంటే.. ఆరు జోన్లు చేసుకున్నామని అన్నారు. ఇన్ని చేసినా హైదరాబాద్ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ ఏనాడూ టచ్ చేయలేదని స్పష్టం చేశారు. ఉన్న జిల్లాలను తీసేయడానికి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త కలెక్టరేట్లు అద్భుమని మీ మంత్రి కోమటిరెడ్డి అన్నాడని గుర్తుచేశారు. చేతనైతే సికింద్రాబాద్ను డెవలప్ చెయ్.. అంతేతప్ప ఫోర్త్ సిటీ పేరుతో తుగ్లక్ పనులు చేయకు అని రేవంత్ రెడ్డికి సూచించారు.