జలమండలి ట్యాంకర్ల బుకింగ్ పెండెన్సీ ఏకంగా ఇరవై వేల మార్క్ను దాటి కొత్త రికార్డులను సృష్టిస్తున్నది. మునుపెన్నడూ లేనంతగా బుకింగ్లు పెరిగిపోతున్నాయి. కేవలం గురువారం ఒక్కరోజే ఏకంగా 20,056 ట్యాంకర్ల పెండెన్సీ నమోదైంది. మరోవైపు గుక్కెడు తాగునీటి కోసం భాగ్యనగరం అల్లాడిపోతున్నది. ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటి జలమండలి నీటి కోసం కన్నీళ్లు ఇంకిపోయేలా ఎదురు చూస్తున్నారు. నీటి ఎద్దడిని అధిగమించేలా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నగర ప్రజలు అవస్థలు పడుతున్నారు.
– సిటీబ్యూరో
భూగర్భ జలాలు అడుగంటి, జలమండలి సరఫరా అరకొరగా వస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో ట్యాంకర్లను ఆశ్రయిస్తే రోజుల తరబడిగా ఎదురు చూడాల్సి వస్తున్నది. ఎద్దడిని అదనుగా తీసుకుని ట్యాంకర్ల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ట్యాంకర్ బుక్ చేసుకున్న వినియోగదారుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. తమ సన్నిహితులకు ముందుగా ట్యాంకర్లు చేర్చేందుకు టోకెన్ సీరియల్ నంబర్ వచ్చినా మిస్డ్ కాల్ చేస్తూ.. స్పందించడం లేదనే నెపంతో దారి మళ్లిస్తున్నారు. దీంతో బుక్ చేసుకుని నాలుగు, ఐదు రోజులైనా నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. నీళ్లు సరిగ్గా రాకపోవడంతో ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది.
కేవలం గురువారం ఒక్కరోజే ఏకంగా 20,056 ట్యాంకర్ల పెండెన్సీ నమోదైంది. శుక్రవారం 10కేఎల్, 5 కేఎల్ సామర్థ్యం కలిగిన ట్యాంకర్ల బుకింగ్స్ మొత్తం 23,137 బుకింగ్ పెండెన్సీకి చేరుకున్నది. జలమండలి చరిత్రలో ఇదే ఆల్టైం రికార్డుగా నిలిచింది. 2019లో తీవ్ర కరువు సంభవించినప్పుడు 20 వేల ట్యాంకర్లు బుక్ అయ్యా యి. ఈ ఏడాది ఎలాంటి కరువు లేకున్నా అధికారుల ముందస్తు చర్యలు లేకపోవడంతో అంతకంటే ఎక్కువ ట్యాంకర్లు బుక్ అయ్యాయి. జలమండలి అధికారుల నిర్లక్ష్యానికి ఈస్థాయిలో పెండెన్సీ నమోదవడం నిలువుటద్దంగా నిలుస్తున్నది.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యం.. క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం.. మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్రెడ్డి జలమండలి వైపు కన్నెత్తి చూడకపోవడం నగర ప్రజలకు శాపంగా మారింది. నిత్యావసరాల్లో అత్యంత ప్రధానమైన తాగునీటి సరఫరాను గాలికొదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్, మాన్సూన్ యాక్షన్ ప్లాన్ల పేరిట సమీక్షలు, సమావేశాలు పెడుతూ కాలయాపన చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో నీటి సరఫరాలో ఇబ్బందులు రావడం.. ట్యాంకర్ల బుకింగ్లు గణనీయంగా పెరగడం వెనుక ఏం జరుగుతున్నదనే కనీస పర్యవేక్షణ లేకపోవడం ప్రజల పాలిట శాపంగా మారుతున్నది.
సరఫరా తగ్గకుండా.. ఏటా జరిగినట్లే కొనసాగుతున్నా ప్రజలు ట్యాంకర్ల వైపు ఎందుకు చూస్తున్నారనే కనీస అవగాహన లేకుండా అధికారులు వ్యవహరిస్తుండటం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. సరఫరా తగ్గించి ట్యాంకర్లకు నీటిని మళ్లించాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతమున్న నీటి ఎద్దడి.. ఎండల తీవ్రతను బట్టి చూస్తుంటే ఈనెలంతా తాగునీటి కటకట ఉంచే ఛాన్స్ ఉంది.
అధికారులు ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజలు మరింత తాగునీటి ఎద్దడి ఎదుర్కొనే దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి తాగునీటి ఇబ్బందులు తొలగించాలని నగర ప్రజలు కోరుతున్నారు. సరఫరాను పెంచి, ట్యాంకర్ల డెలివరీని వేగవంతం చేయాలని వేడుకుంటున్నారు. పర్యటనలు, పరిశీలనలకే పరిమితం కాకుండా చేతల్లో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.