బీజేపీ నాయకులకు సిగ్గుంటే ఆపించాలి
714 నోటిఫికేషన్ ఎత్తేయండి
కేంద్రంపై గర్జించిన వాహన సంఘాలు
ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
సిటీబ్యూరో/కవాడిగూడ, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నోటిఫికేషన్-714తో మోటార్ వాహన రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతారని.. ఆ నోటిఫికేషన్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలన్నీ మంగళవారం ఇందిరాపార్క్లో మహాధర్నా చేపట్టాయి. ఫిట్నెస్ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా అత్యంత ఘోరమైందని తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్కేవీ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. రవాణా శాఖను కేంద్ర ప్రభుత్వం రావణ శాఖగా మార్చే కుట్ర చేస్తుందని విమర్శించారు.
కేంద్రానికి తగిన బుద్ధి త్వరలోనే చెబుతామని హెచ్చరించారు. బీజేపీ నాయకులకు సిగ్గు ఉంటే 714 నోటిఫికేషన్ను రద్దు చేయించాలని మారయ్య సవాల్ విసిరారు. అనంతరం లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వాహనదారుల కష్టాలను అర్థం చేసుకుని కరోనా కష్టకాలంలో మోటార్ వాహనపన్నును రద్దు చేసిందని.. కేంద్ర ప్రభుత్వం కరోనా రోజులకు కూడా పన్ను వసూలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ నాయకులు వెంకటేశ్ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు మాటలు చెప్పడమే గానీ చేతలు లేవని.. కార్మికుల బాధలు పట్టించుకోని కేంద్ర సర్కార్కు తప్పక బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్కేవీ, లారీ అసోసియేషన్, రాష్ట్ర క్యాబ్ అసోసియేషన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ నాయకులు పాల్గొన్నారు.