ఉప్పల్, జూలై 31 : బస్తీల్లో బాధలు వింటున్నా.. ప్రతి గడపను పలుకరిస్తున్న.. బాధ్యతగా సమస్యలు పరిష్కరిస్తున్న.. ప్రజల మధ్య ఉండే నాయకుడిగా ప్రజల కోసమే పాదయాత్ర చేస్తున్నానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. 20 రోజులుగా ‘నమస్తే ఉప్పల్’ పేరుతో ‘మీ కోసం.. మీ ఎమ్మెల్యే’ అంటూ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యేను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది.
ఉప్పల్ నియోజకవర్గంలో ‘నమస్తే ఉప్పల్’ పేరుతో ‘మీ కోసం మీ ఎమ్మెల్యే’ అంటూ ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పాదయాత్ర చేపట్టారు. గత 20 రోజులుగా నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా గడప గడపకు కాలనీలు, బస్తీల్లో పర్యటిస్తూ, ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బస్తీవాసుల సమస్యలను వింటున్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని అడుగుతూ, సమస్యలను తెలుసుకుంటూ.. అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
నమస్తే తెలంగాణ : మీ కోసం మీ ఎమ్మెల్యే పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎమిటి ?
ఎమ్మెల్యే : ప్రజలు మన దగ్గరికి వచ్చి చెప్పుకునే బాధలు, సమస్యలు కొన్ని ఉంటాయి. కొంతమంది రాలేనివారు, సమస్యలు చెప్పుకోలేనివారు ఉంటారు. వారి వద్దకు వెళ్లినప్పుడు కూడా కొన్ని సమస్యలు తెలుస్తాయి. ప్రజల బాధలు తెలుసుకోవడం కోసమే పాదయాత్ర చేస్తున్నా. ప్రజల వద్దకే నేరుగా వెళ్లి వారి సమస్యలు వింటున్నా. వాటికి పరిష్కార చర్యలు వెంటనే చేపడుతున్నాం. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటున్నాం.
నమస్తే తెలంగాణ : ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు మీరు చేపట్టిన ముఖ్యమైన పనులు ?
ఎమ్మెల్యే : నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏడాదిలో 365 రోజులు అందుబాటులో ఉంటున్నా. కరోనా సమయంలో ప్రజలకు నిరంతరం సేవలు అందించాం. అలాగే ఉమ్మడి పాలనలో చేయని పనులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసి చూపించాం. ఉప్పల్ రింగ్రోడ్డులో స్కైవాక్ నిర్మాణం ఉప్పల్కు గర్వకారణం. శిల్పారామం ఏర్పాటు చేశాం. చర్లపల్లిలో బ్రిడ్జి నిర్మాణ పనులతో సమీప కాలనీవాసులకు ఎంతో ఉపయోగపడుతుంది. వైకుంఠధామాల ఏర్పాటు, సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ.60 కోట్లు ఖర్చు చేశాం. గత పాలకులు హామీ ఇచ్చి, తీసుకురాని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఉప్పల్కు తీసుకువచ్చాం. వీటికి తోడు మైనార్టీ, బీసీ గురుకులాలు ఏర్పాటు చేశాం. చెరువులను సుందరీకరించాం.
నమస్తే తెలంగాణ : నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చారా ? ఇంకా చేపట్టాల్సినవి ఏమైనా ఉన్నాయా ? ఏం చేయబోతున్నారు?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చాం. మూసీని సుందరీకరించాం, ఉప్పల్ భగాయత్ సమస్యను పరిష్కరించాం. ఉప్పల్ ప్రాంతానికి మంత్రి కేటీఆర్ సహకారంతో ఐటీని తీసుకువచ్చాం. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతానికి సమస్యలు లేకుండా చూస్తున్నాం. నిరంతరం విద్యుత్ను అందిస్తున్నాం. నాచారంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఆధునీకరించాం. ఉప్పల్లోని చౌరస్తాలను అందంగా తీర్చిదిద్దుకొని, అభివృద్ధి పనులు చేపట్టాం. ఉప్పల్ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంతంలో 24 బస్తీ దవాఖానలు తీసుకువచ్చాం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకువచ్చాం. అసెంబ్లీ సమావేశాల్లో ఆసుపత్రి, డిగ్రీ కళాశాల భవనం కోసం భూమి కేటాయింపు, భవన నిర్మాణం, ఉప్పల్ ప్రధాన రహదారి పనులు వెంటనే పూర్తి చేసేలా చూడాలని కోరుతాం.
నమస్తే తెలంగాణ : నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెబుతారు?
ఎమ్మెల్యే : ప్రజల బాధలను తెలుసుకోవడానికి పాదయాత్ర ద్వారా వారి వద్దకు వెళ్తున్నాం. రాజకీయాలకు అతీతంగా పనులు చేపడుతున్నాం. ఏడాదిలో 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటాను. సమస్యలతో నా వద్దకు డైరెక్టుగా రావచ్చు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే అస్యత ప్రచారాలు, అబద్ధాలను నమ్మి మోసపోవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. నా ఊపిరి కేసీఆర్… నా శ్వాస బీఆర్ఎస్ పార్టీగా పనిచేస్తాను.
నమస్తే తెలంగాణ : పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి ప్రధానంగా గుర్తించిన సమస్యలు చెప్పగలరా ?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో గత 20 రోజులుగా పాదయాత్ర చేపడుతున్నాం. ప్రతి బస్తీ, కాలనీ, గడప గడపను టచ్ చేస్తూ, ప్రజల బాధలు తెలుసుకుంటున్నా. వీటిలో ప్రధానంగా డ్రైనేజీ, రోడ్లు, వరదనీటి సమస్యలపై కాలనీవాసులు, బస్తీవాసులు తెలుపుతున్నారు. వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నాం. పెద్ద సమస్యలకు ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తూ, పనులు చేపడుతున్నాం. వరదనీటి నివారణ కోసం ఎస్ఎన్డీపీ పనుల ద్వారా రూ.10.34 కోట్లతో పనులు చేపట్టాం. రామంతాపూర్, హబ్సిగూడ ప్రాంతాల్లోని 40 పైగా కాలనీలకు వరద ముంపు సమస్యలు లేకుండా చేశాం. బాక్స్ డ్రైన్లు, బ్రిడ్జిల ద్వారా నాచారం, చిలుకానగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వరదనీటి ఇబ్బందులను తొలగించాం.
నమస్తే తెలంగాణ : ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలపై మీరు ఇచ్చే సమాధానం ?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ , బీజేపీ ఎమ్మెల్యేలు పనిచేశారు. వారు చేసిన అభివృద్ధి శూన్యం. పనిచేయలేని నాయకులు, పార్టీలు నేడు విమర్శలు చేస్తున్నాయి. ఉప్పల్ కారిడార్ పనులు నిర్లక్ష్యం చేస్తూ జాప్యానికి కారణమైన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలే విమర్శలు చేయడం సిగ్గుచేటు. మల్కాజిగిరి పార్లమెంట్లో గెలిచినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఇవ్వలేదు. నియోజకవర్గానికి రాకుండా ఉన్న ఆయన, పార్లమెంట్లో ప్రజా సమస్యలపై ఏనాడు ప్రశ్నించలేదు. నేడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం, ఉప్పల్ కారిడార్ పనులపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు, 2018లో బీజేపీకి డిపాజిట్ రాకుండా ప్రజలు తీర్పు ఇచ్చారు. ప్రతి కుటుంబానికి, అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి ఏమీలేదు.