GHMC | సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ ): ఒకవైపు అకాల వర్షాలు..మరోవైపు ముంచుకొస్తున్న ముందస్తు వర్షాలు..అయినా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు.. ముందస్తు ప్రణాళికలతో వరద ముంపు లేకుండా చూడాల్సిన అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తున్నది. ఇప్పటికే కొన్ని చోట్ల పడుతున్న అకాల వర్షాలతో మునిగిపోతున్న కాలనీలు, రహదారులపై ఏరులై పారుతున్న వరద నీరు..పొంగిపొర్లుతున్న నాలాలు.. వాస్తవంగా ఇప్పటి వరకు మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఖరారు కావాల్సి ఉంది.. ఈ నెల 25 లోగా సర్కిళ్ల వారీగా మాన్సూన్ యాక్షన్ బృందాలు వర్షాకాల విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిద్ధం కావాల్సి ఉంది. ఇటీవల కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన ఇంజినీరింగ్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది.
కార్యాచరణలో అదే నిర్లక్ష్యం..
వర్షాకాల విపత్తును ఎదుర్కొని ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధం కావాలి. ఐతే గతేడాది ఐఆర్టీ బృందాల ఏర్పాటులో తీవ్ర జాప్యం చేశారు. జూలై వరకు ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేయలేదు..ప్రధానంగా ఈ పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.. పెండింగ్ బకాయిలు రూ. 1400 కోట్లు చెల్లిస్తేనే టెండర్లలో పాల్గొంటామని తేల్చి చెప్పడంతో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ టెండర్లు స్పందన లేకపోవడంతో జాప్యం జరిగింది. గత అనుభవాలతోనైనా అధికారులు ఈ ఏడాది ముందస్తుగా కార్యాచరణలో అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టర్లు సైతం ఇప్పటి వరకు పెండింగ్ బకాయిల క్లియరెన్స్ చేయలేదని, జూన్ నాటికల్లా రూ.400 కోట్ల మేర బకాయిలు చెల్లిస్తారని చెప్పారే తప్ప ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
మొక్కుబడిగా సమీక్షలు
మాన్సూన్ యాక్షన్ ప్లాన్పై జీహెచ్ఎంసీ మొక్కుబడి సమీక్షలతో సరిపెడుతున్నది. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీ-సిల్టింగ్ పనుల పురోగతి, వాటర్ లాగిన్ పాయింట్లు, వర్షాలతో సంభవించే సంక్షోభ పరిస్థితుల పరిష్కారం పై పూర్తిస్థాయి నివేదిక రూపొందించాల్సింది కమిషనర్ పలు శాఖలకు దిశా నిర్దేశం చేశారు. ట్రాఫిక్ డీసీపీ జోయల్ , జోనల్ కమిషనర్లు హేమంత్ కేశవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
కొరవడిన ముందస్తు ప్రణాళిక..
ఈ నెల చివరి వారం నాటికల్లా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అమలుకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాల్సిన అధికారులు ప్రతిపాదనలు రూపొందించడంలో తాత్సారం చేస్తున్నారు. ప్రతి ఏటా దాదాపు రూ.33 కోట్లతో మాన్సూన్ యాక్షన్ ప్లాన్ను రూపొందించి ఇందుకు సంబంధించి పనులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఏరియాల వారీగా 140 బృందాలు, ప్రత్యేక వాహనాలు, స్టాటిక్ లేబర్స్, మినీ మొబైల్ మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను ఏర్పాటు చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఐఆర్టీ పనులకు ఇప్పటికే టెండర్లు పిలవాల్సిన అధికారులు జాప్యం చేస్తున్నారు. ఇటీవల కమిషనర్ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ ఖరారు చేయాలని ఆదేశించిన ఇప్పటి వరకు పురోగతి లేకపోవడం ఇంజినీరింగ్ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.