‘ ఏం చేయాలె సారూ.. క్షేత్రస్థాయిలో వినియోగదారుడి వద్దకు వెళ్తే చాలా కోపం చేస్తున్నరు. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెల్వక ఇబ్బంది పడుతున్నమంటూ తిట్టి పోస్తున్నరు. ఓవర్లోడ్ అని చెప్పినా వింటలేరు. కేసీఆర్ టైంలో ఎప్పుడూ ఇట్ల కాలేదు కదా.. మరిప్పుడేం రోగమొచ్చిందంటూ మండిపడుతున్నరం’టూ గ్రేటర్లోని పలు సర్కిళ్లలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది తమ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి రోజురోజుకూ పెరిగిన అప్రకటిత కరెంట్ కోతల కారణంగా డిస్కంకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : అధికారులు, సిబ్బందికి కూడా ఫోన్లు చేస్తుండడంతో వారేం సమాధానం చెప్పలేక ఒకరినొకరు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు లోడ్ను తట్టుకునే సబ్స్టేషన్ల నిర్మాణం జరగకపోవడం, కొత్త పనులు చేపట్టకపోవడంతో గ్రేటర్ శివారుప్రాంతాలన్నీ గంటల కొద్దీ అంధకారమయమవుతున్నాయి. సమ్మర్యాక్షన్ప్లాన్లో ప్రతిపాదించిన పనుల్లో ముఖ్యమైనవి అంటే ఓవర్లోడ్ను భరించగలిగే పనులేవీ చేపట్టలేదు సరికదా ఆ పనులకు టెండర్లు పిలిచి వాటిని మొదలేపెట్టలేదు.
ప్రధానంగా గ్రేటర్లోని అన్ని సర్కిళ్లలో క్షేత్రస్థాయి సిబ్బంది వినియోగదారులను సముదాయించలేక ఇబ్బందులు పడుతున్నారని మింట్కాంపౌండ్లో చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు ఏసీ రూముల్లో కూర్చుని కరెంట్ విషయంలో ఏదో ఒక ప్రకటన చేస్తూ కాలం గడుపుతున్నారు కానీ వినియోగదారుల నుంచి వచ్చే ప్రశ్నలు కనీసం ఫిర్యాదులపై కూడా వారు సమీక్ష జరపడం లేదని ఓ సీనియర్ విద్యుత్ అధికారి చెప్పారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో కావాల్సిన మెటీరియల్ లేక, అవసరమైన సిబ్బంది లేక ప్రత్యేకించి లోడ్ను తట్టుకునే సామర్థ్యం కలిగిన ఏర్పాట్లు లేకపోవడంతో తమకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని క్షేత్రస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు తమకు చెప్పకొండానే లోడ్ రిలీఫ్లు అనధికారికంగా తీసుకుంటున్నారని, దీంతో వినియోగదారులు లైన్మెన్లకు ఫోన్ చేసి కరెంట్ పోయిందంటూ నానారకాలుగా మాట్లాడుతున్నారని వారు వాపోతున్నారు. అంతేకాకుండా ఒకవేళ తాము స్పందించకపోతే ఉన్నతాధికారుల నుంచి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉన్నదాంట్లో మేనేజ్ చేయగలుగుతున్నాం కానీ రాబోయే రోజుల్లో అసలు విద్యుత్ సమస్యలు పరిష్కరించగలుగుతామా లేదా అన్న పరిస్థితులు వస్తాయేమోనంటూ సిబ్బందిలో చర్చ జరుగుతున్నది.
ప్రస్తుతం నగరంలో ఉన్న ప్రధాన సబ్స్టేషన్లన్నీ లోడ్ భరించడంలో చివరి దశకు చేరడంతో వాటికిప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసేందుకు దృష్టి పెట్టడం లేదంటూ కార్పొరేట్ ఆఫీసులోనే ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మెటీరియల్ కొనడానికి ఓ కమిటీ ఏర్పాటుచేసినా ఆ కమిటీ సక్రమంగా పనిచేయకపోవడంతో పాటు ఇప్పటివరకు మెటీరియల్ విషయంలో ఓ స్పష్టతకు రాకపోవడంతో లైన్లు కరిగిపోయినా, కండెన్సర్లు, ఏబీస్విచ్లు, ఇన్సులేటర్లకు ఇబ్బంది కలుగుతున్నదనే అభిప్రాయం డిస్కంలో వ్యక్తమవుతోంది.