బంజారాహిల్స్, జనవరి 1: అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీ కొట్టిన ఘటనలో రోడ్డుదాటుతున్న ఇద్దరు మరణించారు. ఈ ఘటన బంజారాహిల్స్ రోడ్ నం.3లోని గ్రీన్ మాస్క్ ఎదురుగా ఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమండ్రి సమీపంలోని ర్యాలీ గ్రామానికి చెందిన అవిడి శ్రీను(50) పెయింటర్. కొండాపూర్లో ఉంటున్నాడు. పెయింటింగ్ పనిలో భాగంగా శనివారం మధ్యాహ్నం బంజారాహిల్స్కు వచ్చాడు. రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉన్నాడు. తెల్లవారుజామున 5.15 ప్రాంతంలో టీ తాగేందుకు బంజారాహిల్స్ రోడ్ నం.3లోని రాయల్ టిఫిన్స్ వద్దకు వచ్చాడు.
టీ తాగి రోడ్డు దాటుతున్న క్రమంలో కేబీఆర్ పార్కు వైపు నుంచి అతివేగంగా పంజాగుట్ట వైపు వెళ్తున్న కారు శ్రీనును ఢీకొట్టింది. అదే సమయంలో రోడ్డు దాటుతున్న భీమవరపు ఈశ్వరి(55)ని కూడా ఢీకొని అదే వేగంతో దూసుకెళ్లి డివైడర్ను ఢీకొని పల్టీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో అవిడి శ్రీను, భీమవరపు ఈశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో రాయల్ టిఫిన్స్ వద్ద పార్క్ చేసిన మరో రెండు కార్లు కూడా నుజ్జనుజ్జయ్యాయి.
ఈ ప్రమాదానికి కారణమైన కారు నడిపిస్తున్న విద్యానగర్ నివాసి కొడాలి ప్రణవ్తో పాటు కారులో ఉన్న పోలసాని శ్రీవర్ధన్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం సికింద్రాబాద్లోని సన్షైన్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, కారు నడిపిన ప్రణవ్తో పాటు శ్రీవర్ధన్రావుకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా.. మద్యం సేవించినట్లు తేలింది. వీరిద్దరూ మాదాపూర్లో న్యూ ఇయర్ పార్టీ చేసుకుని వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నిందితులిద్దరూ బీటెక్ ఫైనలియర్ చదువుతున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన నిందితులు ప్రణవ్, శ్రీవర్ధన్రావు మీద బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 304(2) సెక్షన్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.