మేడ్చల్ రూరల్, మే 31 : మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్య అని మాజీ ఎంపీపీ పద్మాజగన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన వివిధ పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతూ సంతోషంగా ఉన్నారన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా ఎలా లబ్ధి పొందుతున్నారో వివరిస్తూ మంత్రి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని, సీఎం కేసీఆర్తో ప్రకటన ఇప్పిస్తానని చెబుతుండగా కొందరు దాడికి దిగారన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు కూడా సాకారం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయాన్ని వివరిస్తుంగా చాలా మంది హర్షం వ్యక్తం చేస్తుంటే కొంత మంది రాజకీయ లబ్ధి కోసమే దాడికి పాల్పడ్డారన్నారు. ఇది రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని ఆరోపించారు. దాడులకు పాల్పడితే ఒరిగేదేమి లేదని, చరిత్ర హీనులుగా మిగిలిపోవాల్సి వస్తుందని హితవు చెప్పారు. ఇకనైనా బాధ్యులు తమ తీరు మార్చుకోవాలని సూచించారు.
మంత్రిపై దాడి చేస్తే సహించేది లేదు
కీసర, మే 31 : రెడ్డి సింహగర్జనలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై దాడి చేయడాన్ని టీఆర్ఎస్ నేత, రాంపల్లిదాయర మాజీ సర్పంచ్ కందాడి శ్రీకాంత్రెడ్డి ఖండించారు. సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతున్న ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కార్పొరేషన్ ఏర్పాటుకు బాధ్యత తీసుకుంటామని మాట్లాడుతున్న మంత్రిపై కొంతమంది కాంగ్రెస్ అనుచరులు దాడికి పాల్పడటం అన్యాయమన్నారు. ప్రతినిత్యం ప్రజలతో ఉండే మంత్రి మీద దాడి చేయడం చాలా బాధాకరమని, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలే తగిన బుద్దిచెప్పడం ఖాయమని శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు.
రాజకీయ లబ్ధి కోసమే దాడి
శామీర్పేట, మే 31 : రాజకీయ లబ్ధి కోసం కక్ష పూరితంగా మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్డారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్పాష మండిపడ్డారు. రెడ్డి గర్జనలో మంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ శామీర్పేటలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రేవంత్ రెడ్డి, హరివర్దన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, ఎంపీపీ ఎల్లూబాయి బాబు, జడ్పీటీసీ అనితాలాలయ్య, కో ఆప్షన్ సభ్యుడు జహీరుద్దీన్, సర్పంచ్ బాలమణి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.