అధికారుల హామీ అటకెక్కినట్లేనా!
పెదవి విప్పని బోర్డు అధికారులు
ఆందోళనకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్నాయకులు
సికింద్రాబాద్, ఏప్రిల్ 21: కంటోన్మెంట్ బోర్డు అధికారులకు ఇచ్చిన మాట మీద నిలబడే ఆస్కారం లేదని మరోసారి నిరూపించుకున్నారు. ఓ వైపు ప్రజలు కొన్నేండ్లుగా ఇబ్బందులు పడుతున్నా తమాషా చూస్తున్నారే తప్పా సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదు. మరోవైపు తిరుమలగిరి లాల్బజార్లోని కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న గాంధీ కమ్యూనిటీ హాల్ నుంచి డంపిం గ్ యార్డ్ను తరలించాలని పలు దపాలుగా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో నిరసనలు చేపట్టినా అధికారుల్లో చలనం లేదు. గత నెలలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కంటోన్మెంట్ బోర్డు, కేంద్ర సర్కారు విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టారు.
చెత్త వాహనాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంబింపజేశారు. ఆ సమయంలో అధికారులు నాలుగైదు రోజుల్లో డంపింగ్ యార్డు తరలింపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు ను ఈ ప్రాంతం నుంచి తొలగించేందుకు ఓ ప్రత్యేక స మావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో బోర్డు అధికారులు ఆఫ్జల్, దేవేందర్, మహేందర్లు పేర్కొన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డు తరలింపుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కానీ నెల రోజులు దాటినా డంపింగ్ యార్డు తరలింపుపై ఎలాంటి పురోగతి లేకపోవడంపై స్థానికులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
డంపింగ్ యార్డును తొలగించాలి
డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తక్షణమే తొలగించాలి. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు చెత్త దుర్గంధంతో తీవ్రమైన ఆనారోగ్యాల బారిన పడుతున్నారు. కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం స్పందించకపోవడం శోచనీయం.
– మర్రి రాజశేఖర్రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి
డంపింగ్ యార్డును తరలించాల్సిందే
చెత్త దుర్వాసనతో స్థానికులు ఇండ్లలో ఉండాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తున్నది. వర్షాలు కురిస్తే మరింత దుర్గంధం వెదజల్లడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా డంపింగ్ యార్డును తరలించేందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డును తరలించాలి
– జక్కుల మహేశ్వర్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్