సిటీబ్యూరో, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటి వద్ద ఆర్మూడ్ పోలీస్ సిబ్బందితో బందోబస్తు పటిష్టం చేశారు. మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన తరువాత ఆయన ఇంటికి సమీపంలో జూబ్లీహిల్స్ రోడ్డు నం.41లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఈ కార్యాలయాన్ని ప్రజాదర్బార్గా ఉపయోగించాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇంటలిజెన్స్ సెక్యూరిటీ విభాగం(ఐఎస్డబ్ల్యూ) అధికారులు ఆ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అక్కడకు వచ్చే వారికి పార్కింగ్, వసతులపై ఆరా తీశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడకు ప్రతి నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు వచ్చిపోయే అవకాశాలున్నాయి, అందు కు సరిపడా పార్కింగ్ సౌకర్యం, సాధారణ వాహనాలు ఎలా రావాలి, ఎలా బయటకు వెళ్లాలి, ముఖ్యమంత్రి, వీఐపీలకు సంబంధించిన వాహనాల రూట్ తదితర అంశాల గూర్చి ఆ ప్రాంతంలో అధికారులు పరిశీలించారు.
ఈ పరిశీలనలోని అంశాలపై విశ్లేషణ చేసి ఐఎస్డబ్ల్యూ ఒక నివేదికను తయారు చేయనుంది. గురువారం రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నింటిని అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ రెడ్డి నివాసంతో పాటు కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.