హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సిక్కిం వరదల్లో చిక్కుకున్న పలువురు తెలంగాణ టూరిస్టులను సురక్షితంగా హైదరాబాద్కు తరలించేందుకు సీఎస్ శాంతికుమారి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఐఏఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం ఉదయం లాచెన్, లాచుంగ్లలో చిక్కుకున్న ఏడుగురిని ప్రత్యేక హెలికాప్టర్తో ఆర్మీ అధికారులు క్షేమంగా సిలిగురికి పంపారు. బాధితులను బుధవారం రాష్ర్టానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సిక్కిం వరదల్లో తెలంగాణకు చెందిన 20 మంది వరకు టూరిస్టులు చిక్కుకోగా, వారిలో ఏడుగురిని సిలిగురికి సురక్షితంగా తీసుకొచ్చారు.
మిగిలిన 13 మందిలో ముగ్గురి ఆచూకీ తెలియరాలేదని ఆర్మీ అధికారులు చెప్పారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన పర్వతారోహకుడు యశ్వంత్ సిక్కిం గవర్నర్ ఆఫీస్ అధికారుల పర్యవేక్షణలో సురక్షితంగా ఉన్నట్టు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. కాలికి స్వల్పగాయం కావడంతో పర్వతారోహణను విరమించుకున్నట్టు చెప్పారు. ఆదివారం లాచెన్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసిన వారిలో నటి, కూచిపూడి డ్యాన్సర్ సరళకుమారి, ఆమె స్నేహితురాళ్లు లక్ష్మి, కల్యాణి, శృతి, యశోదా దేవి, విజయలక్ష్మి, సత్యలక్ష్మి ఉన్నారు.