బంజారాహిల్స్, ఫిబ్రవరి 8 : అర్ధరాత్రి వేళ యువతితో ఫోన్ చేయించి గదికి పిలిచిన దుండగులు పాతకక్షలతో రియల్టర్ను దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, అతడి మర్మాంగాలను కోసేశారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న(35) కొంతకాలంగా నాగర్కర్నూల్ జిల్లాతో పాటు కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు సొంతూర్లో ఉండగా రాము పేట్బషీర్బాద్ ప్రాంతంలో ఓ విల్లాలో నివాసం ఉంటాడు. కొల్లాపూర్ ప్రాంతంలో అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ పేరుతో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇటీవల బీజేపీలో చేరిన రాము రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా పదేండ్లుగా మణికంఠ అనే వ్యక్తితో రాముకు వ్యాపార లావాదేవీలతో పాటు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ కలిసి యూసుఫ్గూడలోని ఎల్ఎన్నగర్లో నివాసం ఉండే ఓ మహిళ(45) ఇంటికి వస్తుండేవారు. వీరిద్దరి మధ్య ఆర్థిక వివాదాలు, గొడవలు జరుగడంతో పేటబషీరాబాద్ పీఎస్లో కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఎలాగైనా రామును చంపాలని మణికంఠ ప్రణాళిక వేసుకున్నాడు. బోరబండకు చెందిన ఓ రౌడీషీటర్తో పాటు మరికొంతమందిని సిద్ధం చేసుకుని, ఎల్ఎన్నగర్కు చెందిన మహిళతో రాముకు ఫోన్ చేయించి పిలిపించారు.
దీంతో బుధవారం రాత్రి రాము భవనంలోని పెంట్హౌజ్లో ఉన్న సమయంలో మణికంఠ సహా సుమారు 10మంది దుండగులు లోనికి ప్రవేశించి అత్యంత కిరాతంగా హత్య చేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే గురువారం ఉదయమే నలుగురు నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల నుంచి సుమారు 10 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా మణికంఠ వేసిన ప్రణాళికలో నేరుగా పాల్గొన్న నిందితులతో పాటు మృతుడిని అక్కడకు పిలిపించిన మహిళ పాత్రపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎల్ఎన్నగర్లో సుమారు ఆరేండ్లుగా నివాసం ఉంటున్న ఓ మహిళకు చెందిన ఇంటి పెంట్హౌజ్లో హత్య జరిగింది. దీంతోపాటు హత్యకు ముందు రాముకు వచ్చిన ఫోన్ కాల్స్ను పరిశీలించగా ఓ మహిళ నుంచి వచ్చాయని తేలింది.
దీంతో హత్యలో సదరు మహిళకు కూడా సంబంధం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సదరు మహిళపై గతంలో బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో వ్యభిచారగృహం నడిపించినట్లు కేసులు కూడా నమోదు కావడంతో ఆ కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫోన్ చేసిన మహిళను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.