‘ఏకకాలంలో సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకెళ్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధికి చేసేది
ఇంకా ఉన్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఈ నగరం రాష్ర్టానికి కల్పతరువు వంటిది. ప్రజల జీవన ప్రమాణాలను పెంచి విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం’ అని అన్నారు మంత్రి కేటీఆర్. ఎస్ఆర్డీపీలో భాగంగా రూ. 263 కోట్లతో చేపట్టిన కొత్తగూడ- గచ్చిబౌలి ఫ్లై ఓవర్ను నూతన సంవత్సర కానుకగా ఆదివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. రానున్న 50 ఏండ్లకు సరిపడేలా మంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. 31 ఎస్టీపీలు పూర్తయితే దేశంలోనే వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసే మొదటి నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని చెప్పారు. నగరానికి 3వేలకు పైచిలుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు వెల్లడించారు. మూడేండ్లలో ఎయిర్పోర్టు మెట్రో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ ) / కొండాపూర్: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ రూపు రేఖలే మారిపోయాయని, అందుకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశమే కారణమని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. నూతన సంవత్సర కానుకగా కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకు రూ.263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు. దేశంలో ఎకడ లేని మౌలిక వసతులు హైదరాబాద్లో కల్పిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి చేసేది ఇంకా ఉందని.. కానీ చేసింది కూడా ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. నగరానికి విద్య, ఉపాధి కోసం పలు రాష్ట్రాల నుంచి అనేకమంది వస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుకున్న విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పా రు. రాబోయే 50ఏండ్లను దృష్టిలో పెట్టుకొని నీటి సమస్య లేకుండా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. రానున్న ఏప్రిల్ వరకు సీవరేజీ పనులు పూర్తయితే దేశంలోనే వంద శాతం సీవరేజీ కలిగిన మొదటి నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని చెప్పారు.
ఎస్ఆర్డీపీ ద్వారా 34 పనులు పూర్తి
2022 జనవరి 1న షేక్పేట ఫ్లై ఓవర్ను ప్రారంభించగా.. 2023 జనవరి 1న కొత్తగూడ ప్రధాన ఫ్లై ఓవర్తో పాటు అండర్ పాస్, ర్యాంపు నిర్మాణంతో మొత్తం 3 .3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ను ప్రారంభించినట్లు మంత్రి కేటీఆర్ వివరించారు. ఎస్ఆర్డీపీ ద్వారా 47 పనులలో ఇప్పటి వరకు 34 పనులు పూర్తయ్యాయని చెప్పారు. కొత్తగూడతో ఫ్లైఓవర్తో నగరంలో 18వ ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. ప్రజా రవాణా మెరుగు కోసం ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ 70 కిలో మీటర్ల పొడవు గల ఎయిర్ పోర్ట్ మెట్రోకు శ్రీకారం చుట్టారని రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామన్నారు. అంతేకాకుండా నగరంలో 3 వేల ఎలక్ట్రికల్ మోటార్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి తెలిపినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
గోరంత దీపం కొండంత వెలుగు
జగమంత వెలుగు అన్నట్లుగా భారతదేశంలోనే తెలంగాణ ఒక వెలుగు వెలుగుతున్నదని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. గోరంత దీపం.. కొండంత వెలుగు అనే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడిచి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమాలు పరుగులు తీస్తున్నాయని తెలిపారు. చిన్న ఆశతో సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు దేశానికి వెలుగులు నింపేలా విరాజిల్లుతున్నదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమైందన్నారు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని శేరిలింగంపల్లిలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. పీవీ ఎక్స్ప్రెస్ వే తర్వాత నగరంలో అతిపెద్ద ఫ్లైఓవర్గా కొండాపూర్ మల్టీలెవెల్ ఫ్లైఓవర్ నిలుస్తున్నదని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఫ్లై ఓవర్కు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిషరించగా ప్రాజెక్టు సీఈ దేవానందం, ఎస్ఈ వెంకట రమణచే రిబ్బన్ కట్ చేయిం చి ప్రారంభించారు.
ప్రతి డివిజన్ అభివృద్ధికి రూ.150 కోట్లు
గత 50 సంవత్సరాలలో జరుగని అభివృద్ధి 7 సంవత్సరాల కాలంలో జరిగిందని, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికెపూడి గాంధీ అన్నారు. తన నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో రూ.150 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయన్నారు.
ఏడు లక్షల పైచిలుకు జనాభా ఉన్న నియోజకవర్గం కావడంతో నిధులు సైతం అధిక సంఖ్యలో అవసరమవుతున్నాయని, మంచినీటి సమస్యను అధిగమించేందుకు నియోజకవర్గంలో 18 రిజర్వాయర్లను నిర్మించుకున్నామని చెప్పారు. ట్రాఫిక్ సమస్య నియంత్రణలో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మించామన్నారు. వీటితో పాటుగా ఎన్నో ఏండ్లుగా లింగంపల్లి ఆర్యూబీతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించడంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.
అధికారులకు సన్మానం
కొండాపూర్ మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో, భూసేకరణలో ఆహర్నిశలు కృషి చేసిన జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులను మంత్రి కేటీఆర్ సమక్షంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సన్మానించారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణలో కీలకంగా వ్యవహరించి స్థానికులను ఒప్పించి, మెప్పించిన డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, టౌన్ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ రవీందర్ల సేవలను మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతి అధికారి, సిబ్బందిని ప్రభుత్వం, ప్రజలు గుర్తిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శాసన మండలి సభ్యులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వాణీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ప్రాజెక్టు సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్ శంకరయ్య, ఎస్ఈ వెంకట రమణ, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్, సింధు, నాగేందర్ యాదవ్, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.