Hyderabad | ఉప్పల్, ఫిబ్రవరి 26 : కిరాణా షాప్ షట్టర్ తొలగించి అందులో నుంచి నగదు చోరీ చేశారు. చోరీ చేసిన నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అదుపులోకి తీసుకొని, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ గాంధీనగర్లోని మార్కెటింగ్ ప్రాంతంలో జ్ఞాన్ చంద్ శర్మ, రామ్ కిశోర్ అనే ఇద్దరు వ్యక్తులు గత ఎనిమిదేండ్ల నుంచి హోల్సేల్ కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. అయితే రోజు మాదిరిగానే శనివారం రాత్రి కూడా షాపు మూసేసి ఇంటికి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున షాపు షట్టర్ తొలగించి ఉన్న సమాచారం తెలుసుకున్న నిర్వాహకులు షాప్ వద్దకు వచ్చి చూడగా షట్టర్ ఓపెన్ చేసి ఉండడాన్ని గమనించారు. షాపులో ఉన్న రూ. 7 లక్షల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. షాపులోకి వెళ్లే ముందు దొంగలు సీసీ కెమెరాలు బెండ్ చేసి లోపలికి ప్రవేశించారు. చోరీ చేయడం, నగదు దొంగిలించే దృశ్యాలు షాప్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు చోరీ చేసినట్లు గుర్తించారు. వికారాబాద్కు చెందిన మహమ్మద్ ఖాదర్(48), అబ్దుల్ ఖాదీర్(48), రాజేంద్రనగర్ చెందిన షేక్ అబ్దుల్(42)ను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరి నుంచి చోరీ చేసిన ఐదు లక్షల 20వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీ చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.