మెహిదీపట్నం, ఫిబ్రవరి 29: వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్తుండగా.. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు దంపతులతోపాటు రెండేళ్ల బాలుడిని బలిగొన్నది. మృతురాలు ఏడు నెలల గర్భిణి. ఈ ప్రమాదం గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంబాగ్ క్రాస్ రోడ్లో జరిగింది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండలం బండ్ల చంద్రారం గ్రామానికి చెందిన గోపాల్ (38), రేణుక(26) దంపతులు. గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉంటున్నారు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు అర్జున్. రేణుక ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి.
గురువారం ఉదయం గోపాల్ తన బైక్పై భార్య, కుమారుడిని తీసుకొని.. రేణుకకు వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆస్పత్రికి బయలుదేరాడు. ఇబ్రహీంబాగ్ క్రాస్రోడ్ వద్దకు రాగానే.. ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరి బైక్ టిప్పర్ వెనుక చక్రాల కిందకు పోయింది. ఆ ప్రమాదంలో అర్జున్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోపాల్, రేణుకకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ గోపాల్, రేణుక కూడా మృతి చెందారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి.. బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.