సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన ఎట్టకేలకు శుక్రవారం ఎలిసిపోయింది. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆవర్తనాలు బలహీనపడిపోవడంతో వానలు తగ్గుముఖం పట్టినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకు గ్రేటర్లో ఎక్కడ కూడా చెప్పుకోదగిన వర్షపాతం నమోదవలేదు. అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే కురిశాయి. ఈ నెల 17 నుంచి 28 వరకు 12 రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సరాసరి 33.23 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో 25.85 సెం.మీల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 25.1 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంటే 7.5 సెం.మీల తక్కువకు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 23.1 సెం.మీల వర్షపాతానికి గాను 28.2 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంటే 5.1 సెం.మీల అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక మేడ్చల్ జిల్లాలో 31.61 సెం.మీల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 46.4 సెం.మీల వర్షపాతం నమోదైంది. అంటే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 14.81 సెం.మీల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, అక్షాంశం వెంబడి ఏర్పడిన షియర్ జోన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.