మారేడ్పల్లి, జనవరి 11: మహిళా ప్రయాణికులను టార్గెట్ చేస్తూ.. వారి మెడలోని బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ..తప్పించుకొని తిరుగుతున్న దొంగను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి 14.3 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో రైల్వేస్ అదనపు డీజీ మహేష్ భగవత్, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ సలీమా కేసు వివరాలు వెల్లడించారు. న్యూ బోయిగూడలోని రైల్వే క్వార్టర్స్కు చెందిన చిన్నయ్య వీరరాఘవులు ఆకాశ్ ఇంటర్ వరకు చదివి మానేశాడు. ప్రస్తుతం డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు.
జల్సాలకు అలవాటు పడిన అతను దొంగతనాలు చేయాలని ప్లాన్ వేశాడు. అనుకున్నదే తడువుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సంజీవయ్య పార్కు తదితర రైల్వే స్టేషన్లలో ఒంటరిగా ప్రయాణించే మహిళల మెడలో నుంచి బంగారు నగలను చోరీ చేస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు ఆకాశ్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వెంట రైల్వే డీఎస్పీ ఎ. నర్సింహ, ఎస్ఐ మాజీద్, క్రైం సిబ్బంది మహిపాల్రెడ్డి, భవానీ శంకర్, ఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది శ్రీనివాస్, కృష్ణ ఉన్నారు.