రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ వర్కర్స్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు.

Hyd1
కవాడిగూడ, మార్చి 23: రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరై మాట్లాడుతూ జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులను పట్టించుకోకుంటే పట్టణాలు మురికికూపంగా మారే ప్రమాదం ఉందన్నారు. 11వ పీఆర్సీ వ్యవధి గత జూలైతో ముగిసిందని, దీంతో కమిటీ వేసినా సిఫారసు ఏం జరిగిందో తెలియదన్నారు. వేతన సవరణ జరిగే వరకూ ప్రతి కార్మికునికీ తాత్కాలిక భృతి కింద రూ.4వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు, ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రవిచంద్రన్, ప్రధాన కార్యదర్శి కె.ఏసురత్నం, కార్యదర్శులు వనంపల్లి జైపాల్రెడ్డి, కాంతారావు, హరినాథ్రావు, నాయకులు నరసింహ, ఓమలయ్య, విలాస్, దేవేందర్రెడ్డి, కమల, అండాలు, లక్ష్మి, ఎల్లమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.