మేడ్చల్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిరాదరణకు గురైన దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించి అభివృద్ధి చేసింది. ధూపదీప నైవేథ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. దేవాలయాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించారు. అన్ని పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ పండుగల ప్రాచుర్యాన్ని తెలియజేస్తున్నది. మతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి అనేక నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నది. దీంతో ఆధ్యాత్మికత వెల్లి విరిసి దేవాలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ, రంజాన్ పండుగకు తోఫా, క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ గిఫ్ట్లను ప్రభుత్వం అందిస్తున్నది.
దేవాలయాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు..
దేవాదాయ- ధర్మాదాయ పరిధిలోని దేవాలయాలకు పుష్కలంగా నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్లో 639, హైదరాబాద్లో 97, సికింద్రాబాద్ పరిధిలో 87 దేవాలయాలు ఉన్నాయి. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని దేవాలయాల అభివృద్ధికి ఈ వార్షిక సంవత్సరంలో రూ.6 కోట్ల 63 లక్షలు, హైదరాబాద్ పరిధిలో రూ. 3 కోట్లు, సికింద్రాబాద్ పరిధిలో రూ. రూ. 2 కోట్ల మంజూరు చేశారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు, మరమ్మతులు చేసి దేవాలయాలను అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇప్పటి వరకు రూ. 36 కోట్ల నిధులను దేవాలయాల అభివృద్ధికి కేటాయించినుట్ల అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో పాటు ప్రత్యేకంగా సీజీఎఫ్ నిధులను కూడా మంజూరు చేస్తున్నారు.
ధూపదీప నైవేథ్యం..
ప్రతి దేవాలయంలో దీపం ఉండేలా ధూపదీప నైవేథ్యం పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దేవాలయాల్లో ధూపదీప నైవ్యేథ్యం చేసేలా అర్చకులను నియమించి.. ధూపదీప నైవేథ్యం ద్వారా అర్చకులకు ఇప్పటి వరకు రూ. 6 వేలు అందిస్తుండగా.. త్వరలోనే రూ. 10 వేలు అందించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోకి వచ్చే దేవాలయాల్లో ధూపదీప నైవేథ్యంలో గతంలో 207 మంది అర్చకులు ఉండగా.. కొత్తగా మరో 194 మంది అర్చకులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేడు నూతన అర్చకులుగా నియామకమైన వారికి ఉత్తుర్వులను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో అందజేయనున్నారు.
దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురై.. అన్యాక్రాంతమైన దేవాదాయ- ధర్మాదాయశాఖ భూములను ప్రభుత్వం పరిరక్షించే చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం దేవాదాయ- ధర్మాదాయ శాఖ భూముల లెక్కలను తీసింది. కబ్జాలకు గురైన భూమిని 3,200 ఎకరాలు స్వాధీనం చేసుకుని, మిగతా 7,200ఎకరాల భూమి కబ్జాలకు గురికాకుండా ఉండేందుకు జియో ట్యాగింగ్ చేశారు.
మసీదు, చర్చిలకు నిధులు..
మసీదు, చర్చిల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. మసీదుల అభివృద్ధికి వక్ఫ్బోర్డు నుంచి ప్రభుత్వం నిధులను మంజూరు చేయిస్తుండగా.. చర్చిలకు నిధులను మంజూరు చేస్తున్నది. మసీదుల్లో ఉండే ఇమామ్లకు ప్రతినెల రూ.5 వేల చొప్పున అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నది. రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా మసీద్, చర్చిలను అలంకరించేందుకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.
సీఎం కేసీఆర్ వల్లే దేవాలయాల అభివృద్ధి
సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించింది. ధూపదీప నైవేథ్యం ద్వారా అర్చకులను నియమించి దేవాలయాల అభివృద్ధికి పూర్తి సహకారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలేదు. దేవాలయాలను అభివృద్ధి చేసి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ బంధువు అయ్యాడు. బ్రాహ్మణ భవన్ నిర్మించి బ్రాహ్మణులకు సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు.
– కృష్ణమూర్తి, అర్చకుడు. మేడ్చల్
ధూపదీప నైవేథ్యంతో అర్చకులకు బాసట
ధూపదీప నైవేథ్యం అర్చకులకు బాసటగా నిలుస్తున్నది. ఈ పథకం ద్వారా దేవాలయాల అభివృద్ధి జరుగుతోంది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో ఆధ్మాతికత వెల్లి విరుస్తున్నది. దేవాలయాల అభివృద్ధితో ప్రతి పండుగ వైభవంగా జరుగుతున్నది. దేవాలయాల అభివృద్ధికి అనేక నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇది మంచి పరిణామం.
-రామశర్మ, పురోహితుడు