దళిత బంధు రెండో విడత అమలుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చేవారంలోగా దరఖాస్తులు సమర్పించాలని మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీలు ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో మంగళవారం హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పారు. అలాగే మొదటి విడతలో పంపిణీ చేసిన యూనిట్లపైనే దృష్టి పెట్టాలని సూచించారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు రెండో విడత అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. వచ్చే వారంలోగా దళితబంధు ఆర్థిక సహాయానికి దరఖాస్తులు అధికారులు సమర్పించాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని దళితబంధు రెండో విడత అమలుపై సమీక్షించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో దళితబంధు రెండో విడత, లబ్ధిదారుల ఎంపికపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ఆర్థికంగా వెనుకబడిన దళిత వర్గాలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు అనే గొప్ప పథకాన్ని చేపట్టారని మంత్రి తలసాని పేర్కొన్నారు. ఈ పథకం కింద అర్హులైన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.
మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసి వారు కోరుకున్న యూనిట్ను అందజేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రెండో విడత అమలులో ఒక్కో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు వారం రోజుల్లో దరఖాస్తులను అధికారులు అందజేయాలని, వచ్చిన దరఖాస్తులను రెండు, మూడు రోజుల్లో సమగ్ర విచారణ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేయాలని మంత్రి తలసాని సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వవద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని మంత్రి తలసాని సూచించారు. మొదటి విడతలో అందజేసిన యూనిట్ల నిర్వహణ, వారు పొందిన లబ్ధిపై వీడియో, ఫొటో రూపంలో నివేదికలను రూపొందించి అందజేయాలని సూచించారు. కొనుగోలు చేసిన వాహనాలకు దళితబంధు పథకం స్టిక్కర్లను తొలగిస్తున్నారని, వాటిని తొలగించకుండా చూడాలని పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. స్టిక్కర్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, రహ్మత్బేగ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, కౌసర్ మెహినోద్దీన్, బలాల, మోజంఖాన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్, ఎస్సీ కార్పొరేషన్ జిల్లా ఈడీ రమేశ్ పాల్గొన్నారు.